మానవ వికాసానికి, సుఖసంతోషాలకు యోగా: మోడీ
న్యూఢిల్లీ: యోగా ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. మానవ వికాసానికి యోగా ఎంతో ఉత్కష్టమైనదన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యలు లేని జీవనానికి యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. యోగా అంటే సర్కస్ కాదని.. మానవ అంతః సౌందర్య ఉత్ప్రేరకమని మోడీ పేర్కొన్నారు. శాంతి సద్భావన కోసమే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విశ్వ వ్యాప్తంగా జరుగుతున్న యోగా భ్యాసం... మానవాళికి భారత్ ఇస్తున్న కానక అని వివరించారు. రాజ్పథ్... యోగాపథ్ అయిందని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. దాదాపు 40వేల మంది ఔత్సాహికులతో కలిసి ప్రధాని మోడీ కూడా యోగాసనాలు వేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ముందు వరుసలో కూర్చుని, స్వయంగా యోగాసనాలు వేస్తూ అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్రమంత్రులు, ఎంపీలు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి భవన్లో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి భవన్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మాట్లాడూ.. యోగా ద్వారా అందరూ శాంతి, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఢిల్లీలోనేకాక దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ యోగాడేను నిర్వహించారు.