త్రివిధ దళాధిపతులతో మోడీ భేటీ, పాక్ సైన్యం కాల్పులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ త్రివిధ దళాధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీ రక్షణ శాఖ వార్ రూమ్లో జరిగింది. ఇటీవల కాలంలో చైనా, పాకిస్దాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మోడీ సైనిక అధికారులతో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమావేశంలో తమ ప్రభుత్వ ప్రాధామ్యాలు, దేశ భద్రత పరిస్థితులపై మోడీ మాట్లాడారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాలకు తిలోదకాలిస్తున్న తీరు, చైనా దురాక్రమణలనూ మోడీ ప్రస్తావించారు. ప్రధానిగా మోడీ భాద్యతలు స్వీకరించిన తర్వాత త్రివిధ దళాదిపతులతో మొదటి సారి సమావేశమయ్యారు. దీంతో త్రివిధ దళాదిపతులు దేశ రక్షణకు సంబంధించి మోడీకి నివేదికలు సమర్పించారు.
ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశ్ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతలు ఎయిర్ ఛీఫ్ మార్షల్ అరూప్ రహ, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ కే ధోవన్, ఆర్మీ ఛీప్ జనరల్ దల్బీర్ సింగ్ పాల్గొన్నారు.
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాకిస్దాన్ సైన్యం కాల్పులు
పాకిస్దాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. గురువారం రాత్రి ఫూంచ్ జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. పాక్ సైన్యం కాల్పులను భారత భద్రతా దళాలు సమర్ద వంతంగా తిప్పికొట్టినట్లు సమాచారం.