ప్రధాని భేష్, కానీ: రావు, మతతత్వం కాదు: మోడీ
బెంగళూరు/ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞాన శాస్త్రం పైన స్పష్టమైన దార్శకనికత ఉందని భారతరత్న, ప్రఖ్యాత శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు ఆదివారం అభిప్రాయపడ్డారు. మోడీ దార్శనికతకు నిపుణులైన శాస్త్రవేత్తల సలహాలు తోడైతే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు.
ప్రధాని అనుసరిస్తున్న శాస్త్ర విధానాలు, దేశంలో అసహనం తదితర అంశాలపై ఒక ముఖాముఖిలో సిఎన్ఆర్ రావు మాట్లాడారు. ప్రస్తుతం క్రియారహితంగా ఉన్న ప్రధాని శాస్త్రీయ సలహా మండలిని ప్రధాని మోడీ పునరుద్ధరించాలన్నారు.
దేశం అసహనపూరితంగా ఏమీ మారడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో కొంత అసహనం ఉన్నప్పటికీ అత్యధిక శాతం భారతీయులు సహనపరులేనని చెప్పారు. ప్రధాని మోడీ తన కలను నిజం చేసుకోవాలంటే సరైన శాస్త్రవేత్తను సలహాదారుగా పెట్టుకోవాలన్నారు.
మతతత్వాన్ని అందించలేదు: ప్రధాని మోడీ
ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మికతను అందించిందే గానీ మతతత్వాన్ని కాదని ప్రధాని నరేంద్ర మోడీ వేరుగా అన్నారు. రుషులు, మునులు జాతి ధర్మానికే కట్టుబడి ఉండేవారన్నారు. అది అన్ని మతాల కంటే ఉన్నతమైందన్నారు.
‘మై ఇండియా... నోబెల్ ఇండియా' పేరుతో ప్రముఖ జైన సన్యాసి ఆచార్య రత్నసుందర్ సూరీశ్వర్ మహరాజ్ నాలుగు భాషల్లో రచించిన 300వ పుస్తకాన్ని ఆదివారం ప్రధాని మోడీ ప్రత్యక్ష ప్రసార సదస్సు విధానం ద్వారా ఆవిష్కరించారు. ఇది తనకు లభించిన సువర్ణావకాశామన్నారు.
మానవాళి ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సవాళ్లకు భారత ఆధ్యాత్మిక వారసత్వమే పరిష్కారాలు చూపిస్తుందంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పేవారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఈ ప్రపంచం మనల్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోలేకపోయందన్నారు.