జూన్ 24న జమ్మూకాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
న్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే గురువారం (జూన్ 24న) జమ్మూకాశ్మీర్ అఖిలపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. జమ్మూకాశ్మీర్ కు కేంద్రపాలిత ప్రాంతంతోపాటు రాష్ట్ర హోదా ఇవ్వడంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ప్రధాని మోడీ జరపబోయే కీలక రాజకీయ సమావేశం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జమ్మూకాశ్మీర్కు చెందిన ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఈ మేరకు వివరాలను ఎన్డీటీవీతో పంచుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర ఇతర సెక్యూరిటీ, ఇంటెలీజెన్స్ ఉన్నతాధికారులతో సమావేమయ్యారు.
2019లో జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసందే. అలాగే జమ్మూకాశ్మీర్ను జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. అయితే, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది.
జమ్మూకాశ్మీర్కు చెందిన రాజకీయ ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను ఆర్టికల్ రద్దు సమయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు వారిని విడుదల చేశారు.
2018లో మెహబూబా ముఫ్తీ-బీజేపీ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, ఇటీవల జమ్మూకాశ్మీర్కు చెందిన ఏడు రాజకీయ పార్టీలు గుప్కార్ కూటమి లేదా పీఏజీడీగా ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్రంతో చర్చలు జరిపేందుకు ఈ కూటమి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గత డిసెంబర్ నెలలో జమ్మూకాశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గుప్కార్ కూటమికి 100కుపైగా స్థానాలు దక్కగా, 74 స్థానాల్లో గెలిచిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
Recommended Video