దేశంలోని 80 కోట్ల ప్రజలకు దీపావళి వరకు పీఎంజీకేవై కింద ఉచిత రేషన్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించారు.
Recommended Video
ఈ పథకం వల్ల దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందుకుంటారని ప్రధాని తెలిపారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో కొన్ని నెలలపాటు ఈ స్కీమ్ కేంద్రం అమలు చేసింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి పేదలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఏడాది దీపావళి వరకు పేదలకు ఉచిత రేషన్ అందనుంది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వమే కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రస్తుతం 25 శాతం వ్యాక్సిన్ వర్క్ రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని తెలిపారు. రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండినవారికి కూడా ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్లపై సర్వీస్ ఛార్జీ కింద కేవలం రూ. 150 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది.