పీఎన్బీ స్కామ్: చేతులేత్తేసిన ఛోక్సీ.. 'వేతనాల'పై ఉద్యోగులకు లేఖ..
న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ తాజాగా తన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. మెహుల్ రాసిన లేఖను న్యాయవాది సంజయ్ అబోట్ విడుదల చేశారు. 'విధిని ఎదుర్కోవడానికి నేను సిద్దం. నేనే తప్పు చేయలేదన్న సంగతి నాకు తెలుసు. అసలు నిజమేంటో చివర్లో తేలుతుంది' అంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు.
Recommended Video
'పీఎన్బీ'పై మరో పిడుగు: 10వేల ఖాతాల డేటా లీక్.. సీవివితో సహా!
చేతులేత్తేసిన ఛోక్సీ:
తన సంస్థ గీతాంజలి జెమ్స్లో పనిచేస్తున్న 3,500 మంది ఉద్యోగులకు ఇక తాను జీతాలు చెల్లించలేనని ఛోక్సీ చేతులెత్తేయడం గమనార్హం. ఈ విషయాన్ని లేఖలో ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థల దాడుల వల్ల తాను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేయబడ్డానని పేర్కొన్నారు. అంతేకాదు తన ఉద్యోగుల్లో భయాన్ని, మానసిక ఒత్తిడిని సృష్టిస్తున్నారంటూ దర్యాప్తు సంస్థలపై ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం.
మీడియా అత్యుత్సాహం వల్లే :
తన పైనా, సంస్థ పైనా జరుగుతున్న అన్యాయమైన దాడి భయాందోళన నేపథ్యంలో ఈ లేఖ రాయాల్సి వచ్చిందని ఛోక్సీ పేర్కొన్నారు.
నిజమైన భారతీయ గౌరవానికి ప్రతీకగా నిజాయితీగా, సమగ్రతతో, కస్టమర్లకు సేవలందించే లక్ష్యంలో అనేక ఉత్థాన పతనాలను చూశామని, పీఎన్బీ స్కాంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే పరిస్థితి ఇంతలా దిగజారిందని ఆయన ఆరోపించారు.
అభద్రత భావంలో ఉన్నాను:
సంస్థను ఈ స్థితికి తీసుకురావడానికి ఉద్యోగులంతా ఎంత శ్రమించారో తనకు తెలుసని, మీడియా గందరగోళంతో పాటు రాజకీయ ప్రకటనలు తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర అభద్రతలోకి నెట్టాయని ఆరోపించారు. బ్యాంకు ఖాతాలన్ని దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోవడంతో జీతాలు చెల్లించడం కష్టమైందని లేఖలో తెలిపారు.
వేరే కెరీర్ అవకాశాలు చూసుకోండి..:
వేతనాలు చెల్లింపుకు సంబంధించి ఏది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి అని, ఇక విద్యుత్, నిర్వహణ ఛార్జీలు కూడా చెల్లించలేమని ఛోక్సీ చెప్పారు. ఉద్యోగులంతా వేరే కెరీర్ అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దర్యాప్తు సంస్థల తీరు కారణంగా ఉద్యోగులెవరూ ఇబ్బంది పడవద్దని చెప్పారు.
మళ్లీ అందరం కలిసి పనిచేయాలి..:
ఆఫీసు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంపై కూడా స్పష్టంగా ఛోక్సీ ఏమి చెప్పలేదు. అయితే పరిస్థితులన్ని చక్కబడితే ఉద్యోగులందరికి పెండింగ్ బకాయిలను చెల్లిస్తానని హామి ఇచ్చారు. భవిష్యత్తులో ఈ సమస్యలేవి ఉండవని ఆశిస్తున్నట్టు.. మళ్లీ అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.