దొంగ మోదీకి దారి క్లియర్ -నీరవ్ అప్పగింతకు యూకే హోం శాఖ ఆమోదం -నేడో రేపో భారత్కు
వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంలో కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కామ్ తర్వాత లండన్ పారిపోయిన నీరవ్ మోదీని తిరిగి భారత్కు అప్పగించేందుకు వీలుగా యూకే హోం శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
భారత్ లో బ్యాంకులను ముంచడంతోపాటు మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న అభియోగాలకు సంబంధించి నీరవ్ మోదీపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని, అతణ్ని తిరిగి భారత్ పంపాలంటూ లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు గత నెలలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా యూకే హోం శాఖ కార్యదర్శి అప్పగింత ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు. దీంతో ..
నీరవ్ మోదీ అప్పగింతకు సంబంధించిన కీలక ప్రక్రియకు ఆమోదం లభించడంతో మన సీబీఐ, ఈసీ అధికారులు నీరవ్ మోదీని నేడో రేపో భారత్ కు తీసుకురానున్నారు. నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న పీఎన్బీ కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కేసులను ఈడీ పర్యవేక్షిస్తున్నది.
తాను నిర్దోషినని, భారత్ కు వెళితే న్యాయ విచారణ సజావుగా సాగదని, బ్రిటన్ లోనే విచారణ జరిపించాలని నీరవ్ మోదీ చేసిన వాదనలను లండన్ కోర్టు తోసిపుచ్చింది. భారత్ లో నిష్పక్షపాత విచారణ జరగదని అనడానికి ఆధారాలు లేవన్న కోర్టు అతణ్ని భారత్ కు అప్పగించాలని తీర్పు చెప్పడంతో ఇప్పుడు హోం శాఖ అంగీకార ఆదేశాలిచ్చింది. నీరవ్ పై భారత్ కోర్టుల్లో విచారణ సాగనుంది.