పీఎన్బీ స్కాం: వాళ్లేమో జైల్లో.. వీళ్లేమో విలాసాల్లోనా?: శివసేన సంచలన వ్యాఖ్యలు!
Recommended Video
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై శివసేన తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ స్కాం సూత్రధారి నిరవ్ మోడీ బీజేపీలో భాగమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మోసపూరితంగా రూ. రూ.280 కోట్లు లావాదేవీలు జరిపారంటూ ప్రముఖ జ్యూయలరీ డిజైనర్ నీరవ్ మోడీపై ఫిబ్రవరి 5న సీబీఐ వద్ద కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అయితే ఆయన మొత్తం రూ.11 వేల కోట్లకు పైగా మోసం చేసినట్టు గుర్తించామంటూ ఈనెల 14న పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది. ముంబైలో ఛాగన్ భుజ్బల్, పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్లు కుంభకోణాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతుంటే... లిక్కర్ డాన్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి వాళ్లు మాత్రం బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయారంటూ శివసేన ధ్వజమెత్తింది.
విరుచుకుపడిన శివసేన...
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్లకుపైగా ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వ్యవహారంపై శివసేన తీవ్రస్థాయిలో స్పందించింది.
ఆయనతో బీజేపీ ఎందుకు అంటకాగాల్సి వచ్చిందో చెప్పాలంటూ దుయ్యబట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమాల్లో నీరవ్ మోడీ ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది.
వాళ్లు జైల్లో... వీళ్లు విలాసాల్లో...
శుక్రవారం పార్టీ సొంత పత్రిక ‘సామ్నా'లో శివసేన స్పందిస్తూ... ‘నీరవ్ మోడీ బీజేపీలో భాగమే. ఎన్నికల్లో సైతం ఆయన బీజేపీకి సహాయం చేశారు. రూ.100, రూ.500 మేర రుణాలను సైతం కట్టలేక ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం భారీ మొత్తంలో సొమ్ములు పట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు...' అని పేర్కొంది. ముంబైలో ఛాగన్ భుజ్బల్, పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్లు జైళ్లలో మగ్గుతుంటే... లిక్కర్ డాన్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి వాళ్లు మాత్రం బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయారని ధ్వజమెత్తింది.
నెలరోజుల ముందే విదేశాలకు...
పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా 150 నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇప్పించుకుని వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ తదితరులు దాదాపు రూ. 11,300 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం బయటపడుతున్న తరుణంలోనే.. నెలరోజుల ముందే నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు చెక్కేశారు. వీరిని పట్టుకునేందుకు సీబీఐ ఇంటర్పోల్ సాయం కోరడంతో... ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
105 బ్యాంకు ఖాతాలు, 29 ఆస్తుల అటాచ్...
మరోవైపు ఇదే కేసులో ఆదాయ పన్ను శాఖ సైతం పన్ను ఎగవేతలపై విచారణ ముమ్మరం చేసింది. నీరవ్ మోడీ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 105 బ్యాంకు ఖాతాలు, 29 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. మరోవైపు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రప్రభుత్వం ఇప్పటికే నీరవ్ మోడీ పాస్పోర్టును కూడా రద్దు చేసింది.