పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 11వేల కోట్ల కుంభకోణం: భారీ నష్టాలు, 10మంది ఉద్యోగుల సస్పెన్షన్
Recommended Video
ముంబై: దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ముంబై బ్రాంచీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఒక్క ముంబై బ్రాంచిలోనే సుమారు 1.77బిలియన్ డాలర్ల(దాదాపు రూ.11,359 కోట్లు)మోసం జరిగినట్లు గుర్తించామని బ్యాంకు వెల్లడించింది. దీని ప్రభావం ఇతర రుణదాతలపైనా పడే అవకాశముందని తెలిపింది.
ముంబై శాఖలో పలు మోసపూరితమైన, అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, కొంతమంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోందని పీఎన్బీ బుధవారం నాటి ఎక్ఛ్సేంజి ఫైలింగ్లో వెల్లడించింది. ఈ మోసపూరిత లావాదేవీలను బట్టి చూస్తే.. ఈ మొత్తాన్ని ఖాతాదారులు ఇతర బ్యాంకుల ద్వారా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోందన్నారు.
స్పష్టత లేదు
ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ లావాదేవీలపై బ్యాంక్ ఎలా వ్యవహరిస్తుంది?, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డబ్బులను రికవర్ చేయగలుగుతారా?.. ఎలా చేస్తారు? అనే అంశాలపై ఏ మాత్రం స్పష్టత రావడంలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మోసపూరిత లావాదేవీలు
మోసపూరిత లావాదేవీల విషయంలో ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకుపై విచారణ జరుగుతోంది. పీఎన్బీలో 44మిలియన్ డాలర్ల మోసపూరిత లావాదేవీల విషయంలో గత వారం ప్రముఖ నగల డిజైనర్ నీరవ్ మోడీపై సీబీఐ విచారణ చేపడుతోంది. అయితే తాజాగా గుర్తించిన మోసపూరిత లావాదేవీలకు, గతంలోని వాటికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపైనా స్పష్టత లేదు.
10మంది ఉద్యోగుల సస్పెన్షన్
తాజా వ్యవహారాన్ని పీఎన్బీ ఫైలింగ్లో వెల్లడించింది కానీ, బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ దీనిపై స్పందించలేదు. అయితే, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు బ్యాంకింగ్ సెక్రటరీ వెల్లడించారు. ఇప్పటి వరకు పది మంది పీఎన్బీ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
భారీ నష్టాల్లో పీఎన్బీ షేర్లు
మోసపూరిత లావాదేవీల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. రూ.160 షేరు విలువతో బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభించిన పీఎన్బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోయారు.