రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం: రాయ్పూర్ రిసార్టులకు అధికార పార్టీల ఎమ్మెల్యేలు
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కలకలం సృష్టిస్తున్నాయి. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే తమ ఎమ్మెల్యేలను ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్ కు తరలించాయి.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం నుంచి ఎమ్మెల్యేలతో రెండు బస్సులు రాంచీ ఎయిర్ పోర్టుకు బయల్దేరాయి. అక్కడ్నుంచి రాయ్పూర్కు ప్రత్యేక విమానాల్లో తరలించినట్లు సమాచారం. ఒక బస్సులో సోరెన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం మాత్రం.. ఒకవేళ తాను ఎమ్యెల్యేలతో వెళ్తే చెబుతానని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా తమ వద్దే ఉన్నారని, పరిస్థితి తమ ఆధీనంలో ఉందని సీఎం చెప్పారు.
కాగా, ఈ ఎమ్మెల్యేలను రాయ్పూర్లోని మేఫెయిర్ రిసార్ట్లో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని ఓ రిసార్టుకు తమను తరలించే అవకాశముందని అంతకుముందు జార్ఖండ్కు చెందిన ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడు చెప్పారు. ఎమ్మెల్యేల కోసం ఓ విమానం బుక్ అయిందని విమానాశ్రయ వర్గాలు కూడా వెల్లడించాయి.మహారాష్ట్ర తరహాలో సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలను ఆకర్షించి, ప్రభుత్వాన్ని పడగొట్టే యోచనలో బీజేపీ ఉందని అధికార పక్షం భావిస్తోంది.
81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాగా, బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Chhattisgarh | Jharkhand UPA MLAs arrive at Mayfair resort in Raipur pic.twitter.com/55jav3O2dl
— ANI (@ANI) August 30, 2022
అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. అందుకే వారిని కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న ఛత్తీస్గఢ్కు తరలించింది.
కాగా, సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష బీజేపీ.. రాజ్భవన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్ రమేశ్ బైస్.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని ఆగస్టు 25న సీల్డ్కవర్లో గవర్నర్కు పంపింది. అయితే సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. కానీ, మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు మాత్రం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.