డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!
లక్నో: ప్రభుత్వం నుంచి అందే నష్ట పరిహారం కోసం ఇద్దరు మహిళలు దిగ్భ్రాంతికర సంఘటనకు పాల్పడ్డారు. తమపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కథనాలు అల్లారు. పోలీసులను నమ్మించారు. పోలీసులు సైతం నమ్మేశారు. అనంతరం వారిపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో అసలు విషయం బట్టబయలైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లు నాటకం ఆడిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
అచ్చం వెటర్నరి డాక్టర్ దిశ తరహాలోనే..
ఆ ఇద్దరు మహిళలు పన్నిన నకిలీ గ్యాంగ్ రేప్ ఉదంతం మొత్తం వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతాన్ని గుర్తుకు తెచ్చింది. డస్నా టోల్ గేట్ సమీపంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం ఓ టెంపోలో తమను బాబూగఢ్ వైపు తీసుకెళ్లారని నిందితులు పోలీసులకు వెల్లడించారు. వారి చెర నుంచి తాము తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డామని అన్నారు.
ఢిల్లీ కాలుష్యంతో సగం చచ్చాం..ఉరిశిక్ష ఇంకేం వేస్తారు?: నిర్భయ కేసు దోషి..సుప్రీంలో రివ్యూ పిటీషన్ .
వైద్య పరీక్షలకు నిరాకరించడంతో..
సాధారణంగా అత్యాచార ఘటనల్లో బాధితురాలికి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు పోలీసులు. అత్యాచారం జరిగిందా? లేదా? అనేది తేలడానికి పోలీసుల కోణంలో సాగే వైద్య పరీక్షలు ఇవి. ఘజియాబాద్ ఘటనలో ఆ ఇద్దరు మహిళలు మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరించారు. ఆసుపత్రికి తరలించిన తరువాత కూడా.. వైద్య పరీక్షల నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేశారు. దీనితో వారి ప్రవర్తనపై పోలీసుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పోలీసుల విచారణలో అసలు విషయం..
ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం వెల్లడైంది. పోలీసుల ప్రశ్నలకు వారు పొంతన లేని సమాధానాలను ఇచ్చారు. దీనితో వారిని అరెస్టు చేశారు. అత్యాచార బాధితులకు ప్రభుత్వం అందించే నష్ట పరిహారం కోసమే తాము ఈ నాటకం ఆడామని అంగీకరించినట్లు ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్షు జైన్ తెలిపారు. వారిపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అన్నారు.