‘దొంగతనం చేసింది.. కోతిపై కేసు నమోదు చేయండి’
కాన్పూర్: ఇటీవలి కాలంలో ఉత్తరాది పోలీసులకు వింత వింత కష్టాలు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న దెయ్యాన్ని పట్టుకోవాలని ఫిర్యాదు అందితే.. ఇప్పుడు దొంగతనం చేసిందని కోతిపై కేసు నమోదు చేయాలని ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో కోతిపై కేసు నమోదు చేయాలా? వద్దా? అని తలలు పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. కౌశల్పూర్తి ప్రాంతానికి చెందిన ఉర్మిళ సక్సేనా అనే మహిళ సోమవారం గుడికి వెళుతుండగా.. ఓ కోతి ఆమె మెడలోని బంగారు గొలుసును లాగింది. దీంతో ఆ గొలుసు రెండు ముక్కలుగా విడిపోయింది. ఓ ముక్కను కోతి తీసుకుని అక్కడ్నుంచి పరారయింది.
దీంతో ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆ కోతిపై కేసు నమోదు చేయాలని సదరు మహిళ డిమాండ్ చేసింది.
మనుషులు దొంగతనం చేస్తే.. కేసులు నమోదు చేస్తాం కానీ, కోతిపై కేసు నమోదు చేయలేమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఆ కోతిని పట్టుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులను కోరినట్లు పోలీసులు తెలిపారు.