వేదాల మాస్టర్ కు మండిపోయింది (వీడియో)
మంగళూరు: పాఠశాలకు ఆసల్యంగా వెళ్లిన విద్యార్థిని పట్టుకుని ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా విట్ల పట్టణంలో జరిగింది. విట్ల పోలీసులు ఉపాధ్యాయుడి మీద ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విట్ల పట్టణంలో శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దేవస్థానం పక్కనే బ్రాహ్మణుల వేద పాఠశాల ఉంది. ఇదే పాఠశాలలో శ్యామ సుందర శాస్త్రీ పిల్లలకు వేదాలు బోధిస్తున్నాడు. ఇటివల ఓ విద్యార్థి పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడు.
అంతే మాస్టర్ కు మండిపోయింది. విద్యార్థి షర్టు తీసి ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. బాలుడి చెవులు పిండేశాడు. దేవాలయానికి వెళ్లిన వారు ఈ తతంగాన్ని మొబైల్ లో వీడియో తీసి దక్షిణ కన్నడ జిల్లా అధికారులకు అందించారు.
అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు విద్యా శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్యామ సుందర శాస్త్రీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు ఆందోళన చెయ్యడంతో ఆయన మీద కేసు నమోదు అయ్యింది.