ఇక ఆన్లైన్ లోనే పాస్పోర్టు వెరిఫికేషన్: సులువైన ప్రక్రియ..
పాస్పోర్టు సర్వీసుతో సీసీటీఎన్ఎస్ను అనుసంధానం చేయడం ద్వారా ఆన్లైన్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ: పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తోంది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) సహాయంతో వెరిఫికేషన్ ప్రకియను వీలైనంత తొందరగా పూర్తి చేసే సౌకర్యాన్ని పరిశీలిస్తోంది. పాస్పోర్టు సర్వీసుతో సీసీటీఎన్ఎస్ను అనుసంధానం చేయడం ద్వారా ఆన్లైన్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
ఈ ప్రక్రియ అమలులోకి వస్తే.. పోలీసు అధికారులకు ట్యాబ్ల ద్వారానే అభ్యర్థుల డేటా నమోదు చేయాల్సి ఉంటుంది. పాస్ పోర్టు దరఖాస్తుదారుల ఇంటివద్దకు వెళ్లి అక్కడే వారి వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేస్తారు. తద్వారా ఇతరత్రా డాక్యుమెంట్ల అవసరం లేకపోవడంతో పాటు కాలయాపన లేకుండా ప్రక్రియ కొనసాగుతుంది.
పోలీసులు నమోదు చేసే వివరాలతో తదనుగుణంగా క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు, నేరస్తుల వేలి ముద్రలు, జైళ్లశాఖ, జువైనల్ హోం వివరాలను సీసీటీఎన్ఎస్తో ప్రభుత్వం అనుసంధానం చేయనుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషి తెలిపారు.
కాగా, 2009లో సీసీటీఎన్ఎస్ విభాగం అందుబాటులోకి రావడంతో.. అప్పటి నుంచి నేరస్తులకు సంబంధించిన వివరాలన్ని ఇందులో పొందుపరుస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15,398 పోలీస్స్టేషన్లలో 14,284 పోలీస్స్టేషన్లు సీసీటీఎన్ఎస్తో అనుసంధానించి ఉన్నాయి. ఇప్పటి వరకు 2.5కోట్ల ఎఫ్.ఐ.ఆర్ వివరాలు ఇక్కడ నిక్షిప్తం చేయడం గమనార్హం.