ర్యాలీలో రైతు ఆత్మహత్య రాజకీయం: కేజ్రీవాల్ చెట్టెక్కుతాడని వ్యాఖ్య
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకోవడం రాజకీయ రంగును పులుముకుంటోంది. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్ళలు చేసుకోవడంలో మునిగిపోయాయి.
ఇక ముందు అటువంటి సంఘటన చోటు చేసుకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైతును రక్షించడానికి ఏం చేయాలని అనుకుంటున్నారు, ఇక ముందు అలాంటి సంఘటన జరిగితే చెట్టెక్కాలని ఆయనకు చెబుతానని ఆప్ నేత అశుతోష్ వ్యంగ్యంగా అన్నారు. విషయాన్ని రాజకీయం చేయడానికి బదులు పరిష్కారానికి చర్యల గురించి ఆలోచించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచించారు.
ఆమ్ ఆద్మీ ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ సందర్భంగా గజేంద్ర సింగ్ అనే రైతు చెట్టుకపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులను, బిజెపిని నిందిస్తుండగా, కాంగ్రెసు పార్టీ కేజ్రీవాల్పై, ఆప్పై విమర్శలను ఎక్కుపెట్టింది.
పోలీసులు రైతును రక్షించడానికి సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆప్ అంటోంది. వివాదాస్పదమైన భూసేకరణ బిల్లు, రైతులను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రైతు ఆత్మహత్యకు కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది.
రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిన తర్వాత కూడా కేజ్రీవాల్ ర్యాలీని కొనసాగించడాన్ని బిజెపి తప్పు పట్టింది.