రాజకీయ పార్టీలకు రేపటితో ముగుస్తున్న ఈసీ డెడ్ లైన్ ? ఆ వివరాలివ్వకపోతే..
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలలో కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పాటించే క్రమంలో రాజకీయ పార్టీలకు ఈసీ ఈ సందేశం పంపింది. దీని ప్రకారం రేపటిలోగా రాజకీయ పార్టీలు తమకు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని గతంలో కోరింది. ఈ గడువు ముగియబోతున్న తరుణంలో ఈసీ ఆదేశాలను రాజకీయ పార్టీలు అమలు చేస్తాయా లేదా అన్నది రేపు తేలిపోనుంది.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల2న అన్ని రాజకీయ పార్టీలు తమకు ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకూ ఎన్నికల బాండ్ల జారీ ద్వారా అందిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు తమ విరాళాల వివరాలను ఈ నెల 15లోగా సమర్పించాలని ఈసీ ఈనెల 3న అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.

ఎన్నికల బాండ్ల పథకం మొదలైనప్పటి నుంచి తమకు ఈ విధానంలో అందిన విరాళాల వివరాలను పేర్కొంటూ సీల్డ్ కవర్ లో నివేదిక పంపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈసీ దాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్దితి నెలకొంది. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతి జరుగుతోందని, కాబట్టి వీటి చెల్లుబాటుకు ఉన్న రాజ్యాంగబద్ధతను తేల్చాలంటూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
దీంతో అన్ని రాజకీయపార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం మొదలైన దగ్గరి నుంచి తమకు అందిన అన్ని వివరాలు ఈసీకి రేపు సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ వీటిని సుప్రీంకోర్టుకు అందజేయబోతోంది. వీటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులో తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications