Kalyan-Dombivli: రాజ్ థాక్రేతో కలిసి బీజేపీకి షిండే బిగ్ షాక్..!
మహారాష్ట్రలో తాజాగా జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పేరుకు బీజేపీ-శివసేన కూటమి మెజార్టీ స్ధానాలు గెల్చినా రాష్ట్రంలో స్థానిక పరిస్ధితుల సమీకరణాలు మారిపోతున్నాయి. ఇదే క్రమంలో బీజేపీపై అసంతృప్తిగా ఉన్న ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. అనూహ్యంగా రాజ్ థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ తో కలిసి కాషాయ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది.
ఏక్ నాథ్ షిండే కంచుకోటగా భావించే కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. మొత్తం 122 సీట్లలో 50 సీట్లు గెలుచుకుంది. షిండే సేన 53 సీట్లు గెలుచుకోగా, ఎంఎన్ఎస్ ఐదు సీట్లు గెలుచుకుంది. ఉద్ధవ్ థాకరే సేన వర్గం 11 సీట్లు గెలుచుకుంది. కేడీఎంసీ మేయర్ పదవి కావాలంటే అవసరమైన మ్యాజిక్ నంబర్ 62. దీంతో మేయర్ పదవి తమకే ఇవ్వాలంటూ బీజేపీ కంటే 3 సీట్లు ఎక్కువగా గెల్చిన షిండే శివసేన పట్టుబట్టింది.

దీనికి బీజేపీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో చేసేది లేక షిండే సేన .. బీజేపీని వీడి రాజ్ థాక్రే పార్టీ ఎంఎన్ఎస్ తో కలిసి మేయర్ సీటు దక్కించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం షిండే సేనకు ఉన్న 53 సీట్లకు తోడు ఎంఎన్ఎస్ ఐదు సీట్లు కలిస్తే 58 అవుతాయి. వీరికి ఉద్ధవ్ సేన కార్పోరేటర్లు నలుగురు మద్దతివ్వబోతున్నారు. దీంతో షిండే సేన ఇక్కడ మేయర్ సీటు కైవసం చేసుకోబోతోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై భవిష్యత్తులో ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు అంబర్నాథ్, అకోలా మునిసిపల్ కౌన్సిల్లలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అంబర్నాథ్లో బీజేపీ కాంగ్రెస్తో జతకట్టింది. అకోలాలో బీజేపీ -ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ పొత్తులపై కఠినంగా వ్యవహరిస్తోంది. అంబర్నాథ్లో కాంగ్రెస్ తన 12 మంది కార్పొరేటర్లను సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications