జవాన్ ఆత్మహత్య: రాహుల్ గాంధీ అరెస్ట్, పోలీసులపై ఊగిపోయారు
న్యూఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) పైన కేంద్రం వైఖరికి నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి బుధవారం చుక్కెదురయింది. ఆయనను పోలీసులు అరెస్టు చేసారు.
దీనిపై రాహుల్ గాంధీ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లకూడదని పోలీసులు ఆయనకు చెప్పారు. దీంతో ఆయన ఊగిపోయారు. స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారిని నీ పేరేంటని ప్రశ్నిస్తూ.. పరామర్శకు వెళ్తోన్న తనను అదుపులోకి తీసుకున్నారని, పోలీసులకు సిగ్గులేదా? అని అన్నారని తెలుస్తోంది.
ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ తండ్రిని, కుమారుడిని కూడా పోలీసులు స్టేషన్కు తీసుకువాడంపై ఆయన మండిపడ్డారు. పోలీసుల చర్య సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఆసుపత్రి వద్ద పరిస్థితులు చక్కదిద్దడానికే తాము పైన అధికారుల ఆదేశాలు పాటిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కాగా, రామ్ కిషన్ జంతర్ మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ భద్రతా కారణాలు చూపుతూ ఆయనను గేట్ నెంబర్ 5 వద్ద అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై రాహుల్ ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని, ప్రభుత్వ మనస్తత్వం వెల్లడవుతోందని మండిపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అందజేయడంలో తాత్సారం జరుగుతోందని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈ ఘటనపై ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఆసుపత్రి అంటే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించే స్థలం కాదన్నారు. రాహుల్ చెబితే వినిపించుకోలేదని, అందుకే అదుపులోకి తీసుకున్నామన్నారు. రాహుల్ గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ తరలించామని చెప్పారు.