ప్రశాంత్ కిషోర్ ఇంటి అడ్రస్ మారిందిగా: ఇక పూర్తిస్థాయిలో ఆ పార్టీ కోసం: లోక్సభకూ పోటీ
కోల్కత: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు- ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్త.. టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అసెంబ్లీ ఎన్నికలపై ఆయనకు ఉన్న పట్టు ఎలాంటిదో.. మరోసారి నిరూపించాయి ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. ప్రత్యేకించి- పశ్చిమ బెంగాల్. భారతీయ జనతా పార్టీ చావో..రేవోగా పోరాడిన రాష్ట్రం ఇది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలంటూ లేవు.

బీజేపీ ఓటమిని ముందే వెల్లడించిన ప్రశాంత్
ఎంత చేయాలో.. అంతా చేసింది. అయినప్పటికీ- అధికారానికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనే మాటను అటు ఉంచితే- కనీసం మూడంకెల స్థానాలను కూడా అందుకోలేదని ముందే జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఆయన అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. కనీసం వంద స్థానాలను కూడా అందుకోలేకపోయింది కాషాయపార్టీ పశ్చిమ బెంగాల్లో. 76 స్థానాలకే పరిమితమైంది. తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం, మమత బెనర్జీని ఓడించామనే తృప్తి మాత్రమే మిగిలింది కమలనాథులకు.

ఉప ఎన్నిక హీట్..
ఇదిలావుంచితే- ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి రాజుకున్న విషయం తెలిసిందే. భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహిస్తోన్నారు. ఈ స్థానం నుంచి మమత బెనర్జీ పోటీ చేస్తోన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు. తనకు అచ్చొచ్చిన భవానీపూర్ను వదులుకుని నందిగ్రామ్ నుంచి పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ భవానీపూర్ నుంచే పోటీకి దిగారు. బీజేపీ తరఫున టిబ్రేవాల్ పోటీ చేస్తోన్నారు.

భవానీపూర్ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అడ్రస్ ఇప్పుడు భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో కనిపించింది. ఈ విషయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోల్కత దక్షిణ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఈ భవానీపూర్ అసెంబ్లీ స్థానం. మమత బెనర్జీ పోటీ చేస్తోన్న సీటు కూడా ఇదే కావడం చర్చనీయాంశమౌతోంది. భవిష్యత్తులో ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తారని అంటున్నారు.

లోక్సభ అభ్యర్థిగా
కోల్కత దక్షిణం లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. నిజానికి- ఆయన స్వరాష్ట్రం బిహార్. ఇదివరకు అక్కడ అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)కు ఉపాధ్యక్షుడిగా కూడా ప్రశాంత్ కిషోర్ పని చేశారు. బీజేపీతో జనతాదళ్ యునైటెడ్ పొత్తు పెట్టుకోవడాన్ని విభేదించి- బయటికి వచ్చారు. ఆయనకు ఉద్వాసన పలికినట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అప్పట్లో చేసిన ప్రకటన సంచనలం రేపింది.
ఓటు వేయనున్న ప్రశాంత్ కిషోర్
తాజాగా- బిహార్ నుంచి ఆయన పశ్చిమ బెంగాల్కు వలస వచ్చినట్టే. భవానీపూర్ నియోజకవర్గం పరిధిలో తన ఓటు హక్కును కూడా నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం చూస్తే ఆయన భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన ఓటు హక్కును కూడా వినియోగించుకోనున్నారు. హెలెన్ స్కూల్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేయాల్సి ఉంటుంది. పశ్చిమబెంగాల్ రాజకీయాలు గరంగరంగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్.. ఏకంగా తన ఓటును బదలాయించుకోవడం మరింత వేడిని రగిలించినట్టయింది.

ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ..
ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా విస్తృతంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఏపీ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ అవుతారంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున ఆయన పని చేయనున్నారు. ఇప్పటికే ఆయన శిష్యురాలు వైఎస్సార్టీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు.












Click it and Unblock the Notifications