ఈసీ సైట్లో మోడీపై చేసిన కంప్లైంట్ మాయం! తప్పు మాదికాదన్న ఎలక్షన్ కమిషన్!
ఢిల్లీ : కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై చేసిన ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మాయంకావడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశాడు. అయితే దానిపై దర్యాప్తు పూర్తికాకుండానే వెబ్సైట్ నుంచి కంప్లైంట్ను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యల కారణంగా తప్పు జరిగిందని ప్రకటించింది.
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
లాతూర్లో మోడీ ప్రసంగంపై ఫిర్యాదు
మహారాష్ట్ర లాతూర్లో జరిగిన ర్యాలీ సందర్భంగా మోడీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఈసీకి ఫిర్యాదు అందింది. కోల్కతాకు చెందిన మహేంద్రసింగ్ అనే వ్యక్తి మోడీపై ఏప్రిల్ 9న ఈ కంప్లైంట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు 426 ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. ప్రధాని నరేంద్రమోడీపై వచ్చిన కంప్లైంట్ను కూడా అందులో చేర్చింది.
ఫిర్యాదును తొలగించిన ఈసీ
లాతూర్ ర్యాలీలో ఆయన ఓటర్లు పుల్వామా అమరవీరులు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సైనికులకు తమ ఓటును అంకితమివ్వాలని కోరారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నది మహేంద్రసింగ్ ఆరోపణ. ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరణ కోరింది. అక్కడి నుంచి సమాధానం రాకముందే ఈసీ వెబ్సైట్లో పరిష్కారమైందంటూ ఫిర్యాదును తొలగించింది.
మహేంద్రసింగ్ అభ్యంతరం, ఈసీ క్లారిటీ
ఫిర్యాదు పరిష్కారమైందంటూ ఈసీ వెబ్ సైట్లో చూపడంపై మహేంద్రసింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని సమర్థించుకుంది. ఫిర్యాదుపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, మహారాష్ట్ర ఎన్నికల అధికారికి దాన్ని బదిలీ చేశామని ప్రకటించింది. అయితే కంప్లైంట్ చేసి రెండు వారాలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంపై మహేంద్రసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదుచేసిన తర్వాత కూడా ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో పలుమార్లు పుల్వామా, బాలాకోట్ అంశాలు ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.