అనగనగా ఒక ఓటర్ దేవుడు.. 100 శాతం పోలింగ్.. చాలా పెద్ద కథే..!
గాంధీనగర్ : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే. ఒక్క ఓటుతో గెలిచేవారుంటారు.. అదే ఓటుతో ఓడిపోయేవారుంటారు. అలా ప్రతి ఓటు డెమోక్రసీలో కౌంట్ అవుతుంది. ఒక్క ఓటు కూడా ఎంతో విలువైందని చెప్పడానికి ఎన్నికల వేళ గుజరాత్ లో జరిగే ఘటన నిదర్శనంలా నిలుస్తోంది. ఒకే ఒక్కడి ఓటు కోసం ముగ్గురు ఎన్నికల సిబ్బంది.. 30 కిలోమీటర్ల మేర అటవీప్రాంతంలోకి జర్నీ చేస్తారంటే వింతలా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకుండా.. ఆ ఒక్కడి ఓటు కోసం ఎన్నికల సంఘం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వేరే చెప్పనక్కర్లేదు.

ఓటర్ దేవా..!
మూడో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఒకే ఒక్కడి ఓటు కోసం అటవీ ప్రాంతంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. గుజరాత్ లోని జునాగఢ్ పార్లమెంటరీ స్థానంలోని ఈ ఓటర్ పేరు భరత్ దాస్ బాపు. గిర్ అటవీ ప్రాంతంలో ఇతడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఒక్కసారే అని కాదు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ ఒక్కడి కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు.
ఒక్కడి కోసం ముగ్గురికి డ్యూటీ.. 10వేల ఖర్చు..!
గిర్ పశ్చిమ అటవీప్రాంతంలో శివాలయంతో పాటు ఆశ్రమం నిర్వహిస్తున్నారు భరత్ దాస్. 50 ఏళ్ల వయసులో ఇక్కడకు వచ్చిన భరత్ దాస్ బానెజ్ ఏరియాలో సింగిల్ ఓటర్ గా నమోదయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇతని ఒక్క ఓటు కోసం ముగ్గురు సిబ్బంది వస్తారు. అందులో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్, ఒక సహాయకుడు ఉంటారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో ప్రయాణించి భరత్ దాస్ ఓటు నమోదు చేయిస్తారు. ఈ ఒక్కడి ఓటు కోసం సుమారు 10వేల రూపాయల ఖర్చవుతుందనేది అంచనా.

నా ఓటుతో వంద.. అందరూ ఓటేయ్యాలే..!
మంగళవారం నాడు జరిగిన మూడో దశ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు భరత్ దాస్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను ఓటేశాను, దాంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైంది. ఇదేవిధంగా దేశమంతటా ప్రతి పోలింగ్ బూత్ లో 100 శాతం పోలింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
దేశంలోనే ఈ పోలింగ్ బూత్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇతడి ఒక్క ఓటు కోసం ఎన్నికల సిబ్బంది ముగ్గురు కూడా మారుమూల అటవీ ప్రాంతంలోకి ఎన్నికలకు ఒకరోజు ముందే వచ్చి మరునాడు ఆయన ఓటు వేశాక వెళ్లిపోతారట.

ఓటర్ నివాసం నుంచి 2 కి.మీ డెడ్ లైన్..!
2002 నుంచి ఇక్కడే అటవీ ప్రాంతంలో ఉంటున్నానని చెప్పే భరత్ దాస్.. అప్పటినుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నానని చెబుతున్నారు. ఇక్కడ తన ఒక్కడి కోసం ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం గౌరవంగా భావిస్తున్నానని ఫీలవుతారు. ఒక్క ఓటు కూడా ఎంతో విలువైందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదేమోనని అంటారు. ఇక్కడ తన ఒక్కడి ఓటుతో 100 శాతం పోలింగ్ అయినట్లు లెక్క. ఇదే లెక్కన దేశమంతటా ప్రతి పోలింగ్ బూత్ లో వంద శాతం ఓటింగ్ కావాలని కోరుకుంటారు. ఆ ఒక్కడి ఓటు కోసం సహనంతో అంత దూరం వెళ్లే పోలింగ్ సిబ్బంది కూడా నిజంగా గ్రేట్ కదా.
మొత్తానికి ట్విస్ట్ ఏంటంటే.. ఓటర్ దేవుడు పోలింగ్ బూత్ వెళ్లడానికి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించొద్దనేది ఎన్నికల సంఘం నిబంధనట. ఆ రూల్ ప్రకారమే భరత్ దాస్ ఆశ్రమం దగ్గర్లోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తుండటం విశేషం.












Click it and Unblock the Notifications