‘‘పూల్ పార్టీలు, బర్గర్లతో.. విద్యార్థులను లొంగదీసుకున్నారు..’’
ఢిల్లీ యూనివర్సిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐది ఘన విజయం కానే కాదని, పూల్ పార్టీలు, మెక్ డొనాల్డ్స్ బర్గర్లను ఎరగా చూపి విద్యార్థులను ప్రలోభపెట్టి లొంగదీసుకున్నారని .
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీని దారుణంగా మట్టికరిపించి సాధించిన గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ సంబరాలు చేసుకుంటున్నాయి.
అయితే ఎన్ఎస్యూఐది నిజమైన గెలుపు కానే కాదని అంటోంది ఏబీవీపీ. తప్పుడు ప్రచారంతో వాళ్లు విజయం సాధించారని ఏబీవీపీ నేత, డీయూఎస్యూ కార్యదర్శి మహమేధా ఆరోపిస్తున్నారు.
''పూల్ పార్టీలు, మెక్ డొనాల్డ్స్ బర్గర్లను ఎరగా చూపి విద్యార్థులను లొంగదీసుకున్నారు. ప్రలోభాల పర్వంగా సాగిన ఈ ఎన్నికల్లో వారిది నైతిక విజయమే కాదు..'' అని ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో మహమేధా వ్యాఖ్యానించారు.
అయితే ఎన్ఎస్యూఐ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ''విద్యార్థులు ఈసారి రాజకీయాలు కాదు.. మార్పును కోరుకున్నారు. పురోగతి కోసమే తమకు బాధ్యతలు అప్పజెప్పారు..'' అని ఢిల్లీ యూనివర్సిటీ కొత్త అధ్యకుడు రాఖీ టస్సీడ్ తెలిపారు.
ఇక నిరుద్యోగ నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయినందుకే ఈ ఫలితం వెలువడిందని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఉంటుందని, బీజేపీపై వ్యతిరేకత మొదలైందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.