ఢిల్లీ ఫలితాలు: మాయావతికి షాక్, 'నేను లోకల్.. నాకు తెలుసు'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఎస్పీకి కంగు తినిపించాయి. మొత్తం 70 స్థానాలకు పోటీ చేసినా రెండుమూడు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా ఆ పార్టీ అభ్యర్థులు వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. దీంతో బీఎస్పీ జాతీయ హోదాకే ముప్పు ఏర్పడింది.
లోకసభ ఎన్నికల తర్వాత జాతీయ హోదా ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల వరకు బీఎస్పీ గడువు కోరింది. తాజా ఎన్నికల్లో కనీసం రెండు స్థానాలైనా నెగ్గక పోవడం, ఆరు శాతం ఓట్లు దక్కించుకోకపోవడంలోను ఆపార్టీ విఫలమైంది.
సార్వత్రిక ఎన్నికలు సహా అనంతరం జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లోను బహుజన్ సమాజ్ పార్టీ తగిన సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించలేదు. ఈ పరిణామాలు ఆ పార్టీ జాతీయ హోదా మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.
కేజ్రీ ప్రభంజనాన్ని తట్టుకున్న ఆ ముగ్గురు
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుంది బీజేపీకి చెందిన ముగ్గురు నేతలే. రోహిణి నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా 5,367 ఓట్ల మెజార్టీతో ఏఏపీ అభ్యర్థఇపై గెలిచారు. ముస్తఫాబాద్ స్థానంలో బీజేపీ నేత జగదీష్ ప్రధాన్ 6,031 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. బీజేపీ నేత ఓం ప్రకాశ్ శర్మ 7,799 ఓట్ల తేడాతో విశ్వాస్ నగర్ నియోజకవర్గంలో ఏఏపీ అభ్యర్థి అతుల్ గుప్తాను ఓడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జంప్ జిలానీలకు షాక్ తగిలింది. వినోద్ కుమార్ బిన్నీ, షాజియా ఇల్మీ, మాజీ స్పీకర్ ఎంఎస్ ధిర్, షోయబ్ ఇక్బాల్, కృష్ణతీర్థ్ తదితరులు ఓడారు.
కృష్ణానగర్కు బేదీ నాన్ లోకల్ నేను లోకల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణానగర్ నియోజకవర్గంలో ఓటమిపాలైన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ స్థానికేతర వ్యక్తి అని ఆమెపై విజయం సాధించిన ఏఏపీ అభ్యర్థి ఎస్కే బగ్గా అన్నారు. బేడీపై ఆయన 2,277 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు.
తాను కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన వాడినని, ఆమె బయటి వ్యక్తి అని, గెలుపుపై మొదటి రోజు నుంచి తనకు గట్టి నమ్మకం ఉందని, ఇది సామాన్యుల విజయమే తప్ప ఏ ఒక్క పార్టీదీ కాదని బగ్గా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న హర్షవర్థన్ గతంలో ఈ నియోజకవర్గానికి 15 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించారు.
అయితే లోకసభ ఎన్నికలలో ఆయన లోకసభకు పోటీ చేసినప్పుడు ఈ స్థానానికి రాజీనామా చేశారు. సురక్షితమైన సీటుగా బీజేపీ నాయకత్వం భావించి కృష్ణానగర్లో బేడీని దింపగా తీరా ఆమె ఓడిపోవడం పార్టీ సీనియర్ నాయకులకు దిగ్ర్భాంతి కలిగించింది.