యోగి ఎఫెక్ట్: రేప్ ఆరోపణల మాజీ మంత్రికి బెయిల్ ఇచ్చిన జడ్జీ సస్పెండ్
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి సస్పెండ్ అయ్యారు.
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి సస్పెండ్ అయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన లక్నో కోర్టు జడ్జీని అలహాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది.
ఓ మహిళపై అత్యాచారం, ఆమె మైనర్ కూతురుపై అత్యాచార యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 49ఏళ్ల ప్రజాపతికి ఇటీవల లక్నోలోని పీఓసీఎస్ఓ కోర్టు ప్రత్యేక జడ్జీ ఓంప్రకాశ్ మిశ్రా బెయిల్ మంజూరు చేశారు. అయితే, దీనిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.
దీంతో హైకోర్టు న్యాయమూర్తి సదరు జడ్జిని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించారు. చాలా రోజులు తప్పించుకుని తిరిగిన ప్రజాపతిని మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు.. లక్నో బెంచ్ ప్రజాపతికి మంజూరైన బెయిల్ ను రద్దు చేసింది. ప్రజాపతి మంత్రి ఉన్న సమయంలో ఆయనతోపాటు మరో ఆరుగురు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత మహిళ గత ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరారీలో ఉన్న ప్రజాపతి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 15న పోలీసులు ప్రజాపతిని అరెస్ట్ చేశారు.