'పెట్రోల్ ధరలు లీటరుకు రూ.25 వరకు తగ్గించవచ్చు, ఎలాగంటే'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడి చమురు డిమాండ్, ఉత్పత్తిపై అమెరికా ఆంక్షలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనిపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. పెట్రోలు ధరలను రూ.25 వరకు తగ్గించవచ్చునని చెప్పారు.
ధరలు తగ్గుతున్న సమయంలో రూ.1, రూ.2 తగ్గిస్తూ ప్రభుత్వాలు ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రూ.15 వరకు, అడిషనల్ ట్యాక్స్ రూ.10 తగ్గించడం ద్వారా రూ.25 వరకు తగ్గించవచ్చునని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ముడి చమురు ఉత్పత్తిపై అమెరికా ఆంక్షల ప్రభావం ధరలపై పడుతోంది. మరోవైపు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాన్ని తీసుకుంటున్నాయి. కానీ ప్రజలు మాత్రం కేంద్రం పైనే విమర్శలు చేస్తుంటారు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా దీంతో లబ్ధి పొందుతున్నాయి.
Central government saves Rs 15 on every litre of petrol due to fall in crude oil prices. Central government puts additional tax of Rs 10 on every litre of petrol.
— P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018
పెట్రో ధరల పెరుగుదులపై నిరసనలు వెల్లువెత్తుతుండడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోడీ గట్టెక్కిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు మోడీ చర్యలు తీసుకుంటారన్నారు.
ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడు నాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారన్నారు. ఓ చక్కని పరిష్కారంతో మోడీ ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. మరోవైపు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థల అధికారులతో భేటీకి సిద్ధమయ్యారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని తెలిపారు.