రియల్ స్టోరీ: ట్వీట్తో చిన్నారి ప్రాణం కాపాడిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి మరో తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. రైల్వే ప్రయాణికులు తెలిపిన సమస్యలకు ట్విట్టర్ ద్వారా సహాయం చేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే, విప్రో కంపెనీలో పనిచేస్తున్న శంకర్ పండిట్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుధవారం భగల్పూర్-బెంగళూరు అంగా ఎక్స్ప్రెస్లో తన భార్య, కూతురుతో కలిసి బిహార్లోని కియుల్ ప్రాంతంలో తన మామ గారింటికి వెళ్తున్నారు. రైలు బయల్దేరిన కొద్ది సేపటికే పాపకు విపరీతమైన వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి.
తోటి ప్రయాణికులు సాయం చేద్దామనుకున్నా, ఎవరికీ ఏం చేయాలో తెలియదు. శంకర్ సహా ఎవరిదగ్గరా మందులు కూడా లేవు. పోనీ మధ్యలో దిగిపోదామంటే, దగ్గర్లో ఆస్పత్రి ఉందో లేదో తెలియదు. తక్షణ వైద్య సహాయం అందుబాటులో లేకపోవడం, పాప పరిస్థితి విషమంగా మారుతుండడంతో ఏంచేయాలో శంకర్కు పాలుపోలేదు.
చివరకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో @RailMinIndia అనే ఖాతాకు విషయం తెలిపి సహాయం చేయాల్సిందిగా కోరారు. దీనిపై మంత్రి సురేశ్ ప్రభు వెంటనే స్పందించి వెంటనే కోల్కత్తాలోని తూర్పు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. సరిగ్గా రెండు నిమిషాల్లో రైల్వే మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.
ఎక్కడున్నారు, సమస్య ఏంటి, ఇతర వివరాలన్నీ అడిగారు. అక్కడకు దగ్గర్లో ఉన్న అసన్సోల్ స్టేషన్లో వైద్య సహాయంతో కూడిన అంబులెన్స్ను సిద్ధంగా ఉన్నారు. రైలు స్టేషన్కు చేరుకోగానే పాపను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పాప పరిస్థితి మెరుగుపడుతోంది.
దీంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమను రైల్వే అధికారులు వీఐపీలను చూసినట్లు చూసి, ఆదుకున్నారని రైల్వేమంత్రి చేసిన సహాయానికి తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.