గణేషుడికి రసాయన రంగులు పులమడం పాపమని..అక్కడ బంగారాన్ని పూశారు!
ముంబై: రసాయనాలు కలిపిన రంగులను వినాయకుడి విగ్రహాలకు పులమడం మహా పాపం అని చెబుతుంటారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతులను వాడాలని ప్రోత్సహిస్తుంటారు పర్యావరణ వేత్తలు. ముంబైలోని ప్రఖ్యాత గౌడ సారస్వత్ బ్రాహ్మిణ్ (జీఎస్బీ) సేవా మండల్ మాత్రం రసాయన రంగుల మిశ్రమానికి బదులుగా.. ఏకంగా బంగారాన్ని పూతగా పూసింది. ఈ బంగారు గణపతి భక్తులకు దర్శనం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. సాయంత్రానికి ఏర్పాట్లు ముగియబోతున్నాయి. 6 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తామని జీఎస్బీ సేవామండల్ ప్రతినిధులు వెల్లడించారు.
వినాయక మండపానికి 266 కోట్ల బీమా
ఏటా ముంబైలోని మాతుంగలో గల కింగ్ సర్కిల్ లో జీఎస్బీ సేవా మండల్ గణేషుడి మండపాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. విశేషమేమిటంటే- ఈ మండపానికి, గణేషుడిని దర్శించడానికి వచ్చే ప్రతి భక్తుడికీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఈ సారి ఈ బంగారు గణపతి కోసం 266 కోట్ల 65 లక్షల రూపాయల మొత్తాన్ని బీమా చేశారు. 2017, 2018లో చేసిన బీమాతో పోల్చుకుంటే ఈ మొత్తం కాస్త ఎక్కువే. 2017లో 264 కోట్ల 25 లక్షల రూపాయలు, 2018లో 265 కోట్ల రూపాయల బీమా చేశారు. అక్కడితో ఆగలేదు. స్వామివారి దర్శనానికి వచ్చే ఒక్కో భక్తుడికి కూడా 20 కోట్ల రూపాయల మేర బీమా సౌకర్యాన్ని కల్పించారు.
నష్టపరిహారంగా చెల్లించడానికే
ఉగ్రవాదులు దాడి చేసినా, మత కల్లోలాల సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా.. సంభవించే ప్రాణనష్టాన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్బీ నిర్వాహకులు.. మండపానికి వచ్చే ప్రతి భక్తుడికీ 20 కోట్ల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించింది. సాధారణ ప్రమాదాలు చోటు సంభవించినా.. ఈ బీమా వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఈ తొమ్మిది రోజుల్లో కనీసం కోటి మందికి పైగా భక్తులు తమ మండపానికి వచ్చే అవకాశం ఉందని జీఎస్బీ సేవా మండల్ ట్రస్టీ ఆర్ జీ భట్ తెలిపారు. వారితో పాటు 2500 మంది యువతీ యువకులు తమ మండపంలో తొమ్మిదిరోజుల పాటు వలంటీర్లుగా పనిచేస్తారని, వారి జీవనానికి భద్రత కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.