వెయ్యి కోట్లు కలెక్షన్స్ మూవీలో కీలక పాత్ర.. కానీ రోడ్డుపైనే నిద్రిస్తున్న నటుడు !!
సునీల్ గ్రోవర్.. బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'ది కపిల్ శర్మ షో' ద్వారా దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ సంపాదించారు. 'గుత్తీ', 'డాక్టర్ మషూర్ గులాటి' వంటి పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించారు. హిందీతో పాటు పంజాబీ చిత్రాలు, టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్లలోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్' చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించారు.
కాగా హర్యానాకు చెందిన సునీల్ గ్రోవర్ జీవితంలో ఒక దశలో తీవ్రమైన ఆరోగ్య సమస్యను కూడా ఎదుర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో నాలుగు బైపాస్ సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన, మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకుని నటుడిగా బిజీ అయ్యారు. తాజాగా సునీల్ గ్రోవర్ రోడ్డు పక్కన భక్తులతో కలిసి నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఏం జరిగిందంటే..
సునీల్ గ్రోవర్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. గంగా నది ఒడ్డున ఉన్న ఓ ఆలయం సమీపంలో ఇతర భక్తులతో కలిసి నేలపైనే నిద్రిస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ.. "తారే జమీన్ పర్" అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనికి అర్థం 'భూమిపై నక్షత్రాలు'. ప్రస్తుతం ఆయన ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో సునీల్ ఎలాంటి స్టార్ హంగులు లేకుండా, సాధారణ భక్తుడిలా అందరితో కలిసి విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు ఆయన నిరాడంబర జీవనశైలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కితే విలాసవంతమైన జీవితం సొంతమవుతుంది. ఖరీదైన కార్లు, ఫైవ్స్టార్ హోటళ్లు, లగ్జరీ క్యారవాన్లు, కోట్లాది రూపాయల పారితోషికాలు.. ఇవన్నీ సెలబ్రిటీల జీవితంలో భాగమైపోతాయి. కానీ కొందరు నటులు మాత్రం ఎంత స్టార్డమ్ వచ్చినా తమ సాదాసీదా జీవనశైలిని మార్చుకోరు. అలాంటి వారిలో సునీల్ గ్రోవర్ ఒకరు అని.. అందుకు ఇలాంటి వీడియోలో నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications