కర్ణాటక: కేంద్రం వాదనలు అర్ధరహితమన్న సుప్రీంకోర్టు, కాంగ్రెస్కు ప్రశ్నలు
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్ దాటకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video
తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణం చేయలేదని, అందువల్ల వారికి పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రారని కేంద్రం చెప్పడంపై సుప్రీంకోర్టు మండిపడింది. కేంద్రం వాదన అర్ధరహితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎస్ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరిన గవర్నర్, బలనిరూపణకు 15 రోజుల గడువు కూడా ఇచ్చారు.
అయితే, వాదనల సందర్బంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. కేంద్రం వాదన అర్థరహితంగా ఉందని, ఇది ఓపెన్ హార్స్ రైడింగ్కు ఆహ్వానంలా ఉందని పేర్కొంది. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిని కలుపుకుని బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఇది ఇలావుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిస్తే మ్యాజిక్ ఫిగర్(112) కన్నా 4స్థానాలు ఎక్కువగా అంటే 116మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి తగిన మెజార్టీ లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, తమ(కాంగ్రెస్- జేడీఎస్)కు అవకాశం కల్పిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.
అత్యవసరగా తన పిటిషన్ స్వీకరించాలని సుప్రీంకోర్టును బుధవారం రాత్రి విన్నవించారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్ర అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ధర్మాసనంలో జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు కోర్టు విచారణ ప్రారంభించింది. 3.20 వరకూ వాదనలు కొనసాగాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యంతరాలపైనా సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలను సంధించింది. కాంగ్రెస్ తరఫున సింఘ్వీ, ప్రభుత్వం తరఫున ఏజీ కేకే వేణుగోపాల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. బీజేపీ, యడ్యూరప్ప తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కోర్టులో న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఉన్నవారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని వాదనలు వినిపించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
కాగా, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశమిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యవహారంలో గతంలో కోర్టు 48 గంటల సమయమే ఇచ్చిందని చెప్పారు. గోవాలో అతిపెద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడాన్ని ఆయన గుర్తుచేశారు. గవర్నరుకు ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వజాలమని ఆయన పేర్కొన్నారు.
మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా కోర్టు అడ్డుకోగలదా? అని కూడా అడిగింది. అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? అని ప్రశ్నించింది. గతంలో గవర్నరు చర్యను అడ్డుకున్న సందర్భముందని సింఘ్వీ సమాధానమిచ్చారు.
ప్రస్తుతం కర్ణాటకలో ఇంఛార్జి ఎవరని ధర్మాసనం అడగ్గా కేర్టేకర్ ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. గోవా, మణిపూర్, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో కూటములను మొదట ఆహ్వానించారని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన తీర్పులు గవర్నరుకు వ్యతిరేకంగా, ఆయనను అడ్డుకోవడానికి ఇచ్చినవి కావని కోర్టు అభిప్రాయపడింది. గవర్నర్ అధికారాలను తాము అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేయని అత్యున్నత న్యాయస్థానం.. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మరోమారు వాదనలు వింటామని తెలిపింది. దీంతో కర్ణాటక ప్రభుత్వంపై ఉత్కంఠత కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.