ముందస్తుకే మోడీ మొగ్గు?: దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలి: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ మంతటా ఒకే సారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని రామ్నాద్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికలకు మోడీ సిద్దమౌతున్నారనేందుకు ఈ వ్యాఖ్యలు సంకేతాలను బట్టి అర్ధమౌతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు పార్లమెంట్ సెంట్రల్హల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ ప్రసంగించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ, తేది వరకు మొదటి సెషన్ జరుగుతాయి . ఫిబ్రవరి 1వ, తేదిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది.ఎన్ డి ఏ ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే.
ముందస్తు ఎన్నికలేనా
ముందస్తు ఎన్నికలకు నరేంద్రమోడీ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిగితే ప్రయోజనం ఉంటుందని మోడీ భావిస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాల్లో కూడ మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. మెజారిటీ ముఖ్యమంత్రులు ఇందుకు సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశాభివృద్దికి విఘాతం కలుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు.దీనిపై చర్చ జరగాలన్నారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నా
ఎన్నో ఏళ్ళుగా ముస్లిం మహిళల ఆవేదన చెందుతున్నారని రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఈ ఆవేదనకు చెక్ పెట్టేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఈ సెషన్లో ఆమోదం పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నానని కోవింద్ అభిప్రాయపడ్డారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుదామన్నారు.
2022 నాటికి రైతాంగానికి రెట్టింపు
2022 నాటికి రైతాంగానికి రెట్టింపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. సాగు నీటి వ్యవస్థను ఆధునీకరించి రైతులకు నీటి సౌకర్యాన్ని కల్పించనున్నట్టు రాష్ట్రపతి చెప్పారు. నవ భారత కలలను సాకారం చేసుకునేందుకు ఈ 2018 ముఖ్యమైన సంవత్సరంగా కోవింద్ అభిప్రాయపడ్డారు.
విద్యుత్ రంగంలో ప్రగతి పథంలో ఉన్నాం
ఒకే దేశం ఒకే గ్రిడ్ లక్ష్యంతో విద్యుత్ రంగంలో వేగంగా ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్రపతి కోవింద్ చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ, విద్యుత్ , విద్య రంగాల్లో గతంలో కంటే మెరుగైన ప్రగతిని సాధించినట్టు రాష్ట్రపతి చెప్పారు.