టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు: సీఎం పళనిసామి ముందు చేతులు కట్టుకుని గుప్ చిప్ !
కొన్ని రోజుల నుంచి టీటీవీ దినకరన్ జపం చేసిన అన్నాడీఎంకేలోని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు నోరు మూసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గూటికి చేరారు.
చెన్నై: కొన్ని రోజుల నుంచి టీటీవీ దినకరన్ జపం చేసిన అన్నాడీఎంకేలోని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు నోరు మూసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గూటికి చేరారు. సీఎం పళనిసామి తంత్రంతో దినకరన్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకున్నారు.
ఇక దినకరన్ సైతం ఎడప్పాడి పళనిసామికి మద్దతుగా నిలిచే రోజు దగ్గర్లోనే ఉందని ఓ సీనియర్ మంత్రి అంటున్నారు. తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి నోళ్లకు తాళం వేయడం లక్షంగా ఎడప్పాడి పళనిసామి తన రాజకీయ తంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు.
దినకరన్ కు మద్దతుగా ఇన్ని రోజులు మాట్టాడిన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు ఎడప్పాడి పళనిసామి గూటికి చేరారు. ఇంత కాలం ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్ధి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వాలా ? వద్దా ? అంటూ రోజుకోక మాట మాట్లాడుతున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు గప్ చిప్ అంటూ పళనిసామి గూటికి చేరారు.
దినకరన్ ఏదో ప్లాన్ తోనే తన వర్గంలోని ఎమ్మెల్యేలను పళనిసామి గూటికి పంపించారని అన్నాడీఎంకేలోని నాయకులు అంటున్నారు. అయితే పళనిసామి మాత్రం తన మార్క్ రాజకీయ తంత్రంతో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకున్నారని తెలిసింది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల చెన్నై చేరుకుని తనకు మద్దతు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మనవి చేశారు. ఆ సందర్బంలో జరిగిన కార్యక్రమంలో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ ఎడప్పాడి పళనిసామి ముందు కుర్చుని మీరు చెప్పినట్లే చేస్తాం అంటూ చేతులు కట్టుకుని కుర్చున్నారు.