మహిళపై ఐదేళ్లుగా పూజారీ రేప్, వీడియో తీసి బ్లాక్మెయిల్
న్యూఢిల్లీ: ఓ 37 ఏళ్ల మహిళ పైన ఓ ప్రీస్ట్ గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఔటర్ ఢిల్లీలోని రోహిణీ సెక్టార్-7 ప్రాంతంలో వివాహితపై ఐదేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో ఓ పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం చెప్పారు.
రాజేష్ పాండే (42) అనే ఈ పూజారి ఐదేళ్ల క్రితం తొలిసారి తనపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దృశ్యాలను చిత్రీకరించాడని, ఈ వీడియో క్లిప్ను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ అప్పటి నుంచి తనపై తరచుగా అకృత్యాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు నార్త రోహిణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
భర్త, ఇద్దరు పిల్లలతో కలసి రోహిణీ సెక్టార్-7 ప్రాంతంలో నివసిస్తున్న ఈ మహిళ తన కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపాల్సిందిగా రాజేష్ పాండేను ఆశ్రయించింది.
పూజల పేరుతో పాండే ఒకరోజు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. రాజేష్ పాండే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్ పూర్కు చెందిన వాడు. అతను గత ఇరవై అయిదు ఏళ్లుగా స్థానిక సాయిబాబా గుడిలో పూజారీగా పని చేస్తున్నాడు.