పూజ పేరుతో పూజారి దిక్కుమాలిన చర్య!: బాత్రూమ్లో మహిళపై అత్యాచారయత్నం
గుడ్డిగా నమ్మిన మహిళ అతనితో పాటు బాత్రూమ్ కు వెళ్లగా.. స్నానం చేయిస్తూ పూజారి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
బెంగుళూరు: ఎంత అవివేకం.. ఎంత మూర్ఖత్వం.. పూజారి వేశం కట్టగానే దైవాంశ సంభూతులు అయిపోతారా? మంత్రాలు ఉచ్చరించడం వల్లే సమస్త జ్ఞానమూ, సమస్త వికాసము జరుగుతుందని విశ్విసిస్తే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదేమో!.
పూజారి వర్గం పట్ల జనాల్లో నాటుకుపోయిన విధేయత, భక్తి భావాన్ని ఆసరాగా చేసుకుని ఈమధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతుండటం కలవరపరుస్తోన్న అంశం. జనం కూడా వెర్రిగా వాళ్ల మాటలను వినడమే తప్పితే.. అందులో తర్కం ఎంత అని ఆలోచించలేకపోతుండటం మరింత విషాదం.
తాజాగా కర్ణాటకలోని తురువెకెరె తాలుకాలోని అళ్ళాలసంద్ర గ్రామంలో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి అద్దం పడుతోంది. ఇంట్లో శాంతిపూజ చేయిస్తే అంతా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఓ కుటుంబం స్థానిక పూజారిని ఆశ్రయించింది. ఇందుకోసం పూజారి ఓ ముహూర్తం ఫిక్స్ చేయగా.. దానికి అవసరమైన సరంజామా అంతా కుటుంబం రెడీ చేసి పెట్టింది.
ముహూర్తం పెట్టిన రోజు సదరు పూజారి ఆ కుటుంబం ఇంటికి వచ్చాడు. ఇంటి యజమానిని, అతని కొడుకును పూజ గదిలో కూర్చోబెట్టి అతని భార్యను తలస్నానం చేసి రమ్మన్నాడు. అంతేకాదు, స్నానం తను చేయిస్తేనే పూజ ఫలిస్తుందని నమ్మబలికాడు. గుడ్డిగా నమ్మిన మహిళ అతనితో పాటు బాత్రూమ్ కు వెళ్లగా.. స్నానం చేయిస్తూ పూజారి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో.. సదరు పూజారి అక్కడినుంచి జంప్ అయ్యాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా పూజారిని మహేష్ ను పట్టుకుని పంచాయితీ నిర్వహించారు. రూ.5లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోవడంతో అంతా కలిసి దేహశుద్ద చేసి పోలీసులకు అప్పగించారు.