60 ఏళ్లలో రైతులకు కాంగ్రెస్ ఏం చేసింది, కమీషన్లు, 18 నెలల్లో చేశాం: ప్రధాని మోడీ ఫైర్!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ఎవ్వరూ కాపాడలేరని, ఇంటికి వెళ్లడానికి ఆ పార్టీ నాయకులు సిద్దంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య సీదా రూపాయి ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కర్ణాటక ప్రజలు చాల ఉత్సాహంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
రైతుల సమావేశం
మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హుబ్బళి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తరువాత హెలికాప్టర్ లో దావణగెరె చేరుకున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప 75వ జన్మదిన సందర్బంగా ఏర్పాటు చేసిన రైతుల బహిరంగ సభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతలకు ఏం న్యాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వాటిని అమలు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి
రైతులకు తీవ్రస్థాయిలో అన్యాయం చేసిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కనపడకుండా చెయ్యాలని, అందుకు కర్ణాటక కేంద్ర భిందువు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
కేంద్రం ఇచ్చింది
కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిందని, అయితే ఇక్కడ ఉన్న సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కమిషన్ల కోసం ఆశపడటంతో ఒక్క పథకం జారీ కాలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
కమీషన్ సర్కారు వద్దు
కర్ణాటకలోని కమీషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీకు వద్దని, రైతుబంధు బీఎస్. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇక్కడున్న అన్నదాతలు ఆశీర్వదించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంతకుమార్, అనంత్ కుమార్ హెగ్డే, సదానంద గౌడ తదితరులు పాల్గొన్నారు.