మోడీ భార్య జశోబాబెన్ కోరిన సమాచారాన్ని ఇవ్వలేం: మెహసానా పోలీసులు
న్యూఢిల్లీ: తనకు కల్పిస్తున్న భద్రత, ఇతర అంశాలకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ సతీమణి జశోదాబెన్ అడిగిన సమాచారాన్ని ఇవ్వలేమని పోలీసులు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఆమె అడుగుతున్న సమాచారం స్ధానిక నిఘా విభాగం (ఎల్.ఐ.బి) పరిధికి వస్తుందని, ఆ విభాగానికి సమాచార హక్కు చట్టం నుంచి మనిహాయింపు ఉందని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత నిబంధనల మేరకు పోలీసులు ప్రధాని భార్య హోదాలో జశోదాబెన్కు భద్రత కల్పించారు. అయితే తన అనుమతి లేకుండా తనకు భద్రత ఎలా కల్పిస్తారని నాడు అసహనం వ్యక్తం చేసిన జశోదాబెన్, సదరు అంశానికి సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ వ్యవహారం స్థానిక ఇంటెలిజెన్స్ బ్యూరో కిందకు వస్తున్నందున, సమాచారాన్ని అందించలేమని తాజాగా మెహసానా పోలీసులు తెలిపారు. తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన యాక్చువల్ ఆర్డర్ ధ్రువీకృత కాపీ సహా పలు పత్రాలను తనకు ఇవ్వాల్సిందిగా అందులో కోరారు. తన గార్డులు కార్ల వంటి ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తుండగా, ప్రధాని భార్యనై ఉండీ తాను బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణిస్తున్నానని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె గార్డులే.. పైగా ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే కాల్చి చంపారని జశోదా బెన్ గుర్తు చేశారు. తన గార్డుల పట్ల కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. తన భద్రత కోసం నియోగించే గార్డుల నియామక పత్రాన్ని తనకు సమర్పించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
జశోదాబెన్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన విషయాన్ని మెహసానా ఎస్పీ జేఆర్ మొథాలియా ధ్రువీకరించారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన జశోదాబెన్... మెహసనా జిల్లాలోని ఉంఝా పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె భద్రత నిమిత్తం 10 మంది పోలీసుల్ని కేటాయించిన విషయం తెలిసిందే.