రికార్డు బద్దలయ్యేనా?: 46రోజుల పాటు భారత్లో మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ భారత్లో 46 రోజుల పాటు ఉన్నారు. మే 26, 2014న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్లో కంటే కూడా విదేశాల్లోనే మోడీ ఎక్కువగా విహరించారు. ప్రధాని మోడీ విదేసీ టూర్లపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విదేశాలకు వెళ్లకుండా భారత్లోనే అత్యధికంగా 46 రోజులు పాటు గడిపి రెండోసారి రికార్డు సృష్టించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలు గడుస్తుండగా, ఈ సంవత్సరం మాత్రం ఇంతవరకూ ఏ విదేశీ పర్యటనకు వెళ్లక పోవడం విశేషం.
గతేడాది డిసెంబర్ చివర్లో 23 నుంచి 25 మధ్య రోజుల్లో రష్యా, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో పర్యటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దేశ పర్యటనకు వెళ్లలేదు. 2014లో నవంబర్ 26 తర్వాత 2015 మార్చి 9వ తేదీ వరకూ ఆయన ఇండియాలో 72 రోజులు గడిపారు.
ఆ తర్వాత ప్రధాని భారత్లో ఎక్కువ రోజులు ఉండటం ఇది రెండోసారి. అయితే ఈ ఏడాది మార్చి 31వ తేదీన అమెరికాలో జరిగే న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్కు హాజరు కానున్నారు. ఈ విదేశీ పర్యటనకు మరో 40 రోజులకు పైగా సమయం ఉండటంతో, ఈ మధ్యలో మరే దేశానికి వెళ్లకుండా ఉంటే, 82 రోజుల పాటు ఏ దేశానికీ వెళ్లకుండా ఉన్నట్లవుతుంది.
2016లో సాధ్యమైనంత వరకు ప్రధాని మోడీ దేశ రాజకీయలైప దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీని బలపరచడం, మరోవైపు ఫిబ్రవరిలో బడ్జెట్, కీలక బిల్లుల ఆమోదం లాంటి అంశాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చిలోగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, సహా దేశంలో 8 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది పెద్దగా విదేశీ పర్యటనలు పెట్టుకోబోనని మోడీ ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖకు, ఓఎఫ్ బీజేపీ (ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ)కి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
2014లో ప్రధాని మోడీ 7 నెలల కాలవ్యవధిలో 9 దేశాలను సందర్శించారు. నెలకు 1.2 దేశాలు తిరిగారని దీని అర్ధం. మొత్తంగా చూస్తే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 28 దేశాలు చుట్టొచ్చారు. 2014లో 30 రోజులు, 2015లో 54 రోజుల పాటు ఆయన విదేశాల్లోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే 2016లో ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ప్రెంచ్ అధ్యక్షుడుకి భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్లో రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, బ్రెజిల్లు పాల్గొనున్నాయి.