నేను బయటి వాడినైతే సోనియా ఎవరు: మోడీ
పాట్నా: బీహార్ శాసన సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ గంజ్ జిల్లాలో జరిగిన రెండు ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంలో ఆయన తాను బీహారిని కాదని అయితే భారత ప్రధాన మంత్రిని అని అన్నారు.
బీహార్ ను దోచుకున్న వారిని ఈ ఎన్నికల సందర్బంగా శిక్షించాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీపిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన మనవి చేశారు.
రాష్ట్రంలో అవినీతిని అంతంచేసి చూపిస్తానని అన్నారు. ముజాఫర్పూర్ నిర్వహించిన ర్యాలీలోనూ మోడీ ప్రసంగించారు. బీహార్ ఓటర్లకు ఒక విషయం చెప్పడానికి తాను ఇక్కడకు వచ్చానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తనపై విశ్వాసం ఉంచారని చెప్పారు.
మీరు నన్ను నమ్మండి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామీద నమ్మకం ఉంచండి అని చెప్పారు. నితీశ్ కుమార్ చేసిన బీహార్ వర్సెస్ బాహరి కామెంట్ కు నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు.
"నేను బయటి వ్యక్తిని అని చోటా బాయ్ (నితీశ్ కుమార్) అన్నారు. సరే నేను బయటి వ్యక్తిని అయితే వారి నాయకురాలు సోనియా గాంధీ ఎవర"ని సూటిగా ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన తరువాత తన మీద ఆరోపణలు చెయ్యాలని సూచించారు. సోనియా గాంధీ బీహార్ లో నివాసం లేరని ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారని గుర్తు చేశారు.
అయితే సోనియా గాంధీని బీహారి అంటారా లేదా బాహరి అంటారా అని నితీశ్ కుమార్ ను ప్రశ్నించారు. తాను భారతదేశ ప్రధాన మంత్రి అని నితీశ్ కుమార్ గుర్తు పెట్టుకోవాలని, ఆయనకు జ్ఞాపకశక్తి ఉందనుకుంటున్నానని కామెంట్ చేశారు.
"నేను భారత ప్రధాని కాదా, బీహార్ భారత్ లో లేదా అనే విషయం జేడీయూ, ఆర్జేడీ నాయకులు చెప్పాల"ని డిమాండ్ చేశారు. బీహార్ భారత్ లో ఉన్నప్పుడు తాను బయటి వ్యక్తి ఎలా అవుతానని ప్రశ్నించారు. బీహార్ ప్రజలు బీజేపీని గెలిపిస్తే మంచి రోజులు వస్తాయని తెలుసుకున్నారని నరేంద్ర మోదీ అన్నారు.