జలుబు తగ్గిపోవాలంటే: మోడీ చెప్పిన మూడు చిట్కాలు ఏమిటో తెలుసా? కైలాస యాత్రకు నడుచుకుంటూ వెళ్లారట!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీలో ఉన్న మరో కోణం ఆవిష్కృతమైంది. ప్రజలకు తెలియని చాలా విషయాలను ఆయన బుధవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రోజువారీ కార్యకలాపాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయాల్లోకి రాక ముందు- నరేంద్రమోడీ కైలాష్ యాత్ర కాలినడకన వెళ్లారట. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర కైలాష్ యాత్రను కాలినడకతోనే పూర్తిచేశారట. ఈ సందర్భంగా తాను చాలామంది సాధువులను కలుసుకున్నానని మోడీ చెప్పారు. ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ ఎక్కువే చూపుతానని, చిన్నపాటి అనారోగ్యానికి డాక్టర్ల వద్దకు వెళ్లనని అన్నారు. తాను ఆయుర్వేదాన్ని విశ్వసిస్తానని మోడీ అన్నారు. చిన్నా, చితక అనారోగ్యానికి గృహ వైద్యం చిట్కాలను అనుసరిస్తానని చెప్పారు.
మోడీ-దీదీ మధ్య ప్రత్యేక అనుబంధం: కొట్టుకుంటున్న టీఎంసీ, బీజేపీ కార్యకర్తల్లారా! మోడీ మాట వినండి!
జలుబు చేస్తే..
జలుబు తగ్గించుకోవడానికి మూడు వంటింటి చిట్కాలను చెప్పారు మోడీ. ఒకటి- వేడినీళ్లు తీసుకోవడం, రెండు- ఉపవాసం ఉండటం, మూడు- ఆవాల నూనెను వాడటం. తనకు జలుబు చేస్తే.. ఈ మూడింటినీ పాటిస్తానని, రెండే రెండురోజుల్లో తగ్గిపోతుందని మోడీ చెప్పారు. జలుబు చేసినప్పటి నుంచీ వేడినీళ్లను మాత్రమే తీసుకుంటానని, చన్నీళ్ల జోలికి అస్సలు వేళ్లనని అన్నారు. వీలైతే- ఆహారాన్ని కూడా తీసుకోనని చెప్పారు. ఉపవాసం ఉంటానని చెప్పారు. ఒక్కరోజు గానీ, రెండురోజులు గానీ ఉపవాసం ఉంటే.. జలుబు తగ్గిపోతుందని మోడీ వెల్లడించారు. రాత్రి పడుకోబోయే ముందు- ఆవాల నూనెను కొద్దిగా వేడి చేసి, ఓ రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటానని అన్నారు. ఇది మంట పుట్టించినప్పటికీ.. వెంటనే తగ్గుతుందని అన్నారు. దీన్ని అందరూ పాటించవచ్చని, ఇలా చేయడం వల్ల జలుబు రెండురోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు. ఇలాంటి చిట్కాలు తన వద్ద చాలా ఉన్నాయని, వాటిని అనుసరిస్తానని చెప్పారు.
కైలాష్ యాత్రకు నడుచుకుంటూ వెళ్లా..
కైలాస మానస సరోవరం యాత్రను అన్నింటి కంటే కఠినమైనదిగా భావిస్తారు భక్తులు. ఎత్తయిన పర్వతాలు, లోతైన లోయల గుండా సాగుతుందీ యాత్ర. కాస్త డబ్బున్న వాళ్లు హెలికాప్టర్ల ద్వారా వెళ్లొచ్చేస్తుంటారు. అలాంటి కఠినమైన కైలాస మానస సరోవరం యాత్రను తాను కాలినడకన పూర్తి చేశానని మోడీ చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లానని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా తనకు చాలామంది ధనికులతో పరిచయం ఏర్పడిందని అన్నారు. నాలుగైదు రోజులు గడిచేసరికి వారికి చర్మం కమిలిపోయేదని, తనకు ఆ ఇబ్బంది తలెత్తేది కాదని చెప్పారు. కొన్ని వంటింటి చిట్కాలను సూచించానని మోడీ నవ్వుతూ చెప్పారు. కైలాస యాత్ర సందర్భంగా ఎండ తీవ్రత దెబ్బకు చర్మం కమిలిపోకుండా తాను ఆముదాన్ని వాడేవాడినని అన్నారు. రాత్రి పడుకునే సమయంలో ఒంటికి ఆముదం రాసుకునే వాడినని మోడీ చెప్పారు. ఇలా చేయడం వల్ల తన చర్మం కమిలిపోయేది కాదని చెప్పారు.
కోపం వస్తుంది.. కాగితం మీద రాసుకుంటా
అందరిలాగే తనకూ కోపం వస్తుందని, దాన్ని తగ్గించుకోవడానికి కూడా చిట్కాలు పాటిస్తానని అన్నారు మోడీ. ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదని చెప్పారు. విధి నిర్వహణలో తాను నేను కఠినంగానే వ్యవహరిస్తానే గానీ కోపాన్ని ప్రదర్శించనని చెప్పారు. ఎవరైనా తప్పు చేస్తే.. శాంతంగానే సరిదిద్దే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈగోను కూడా తాను బయటికి ప్రదర్శించనని అన్నారు. కోపం తెప్పించిన ఘటనలన్నింటినీ కాగితం మీద రాసుకుంటానని, దీనివల్ల కోపం అంతా అక్షరాల రూపంలో బయటికి వస్తుందని అన్నారు. ఆ తరువాత దాన్ని చదవను కూడా చదవనని, చించి పారేస్తానని చెప్పారు.