28న వారణాసికి మోడీ, అద్వానీ-కేజ్రీ భేటీ రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 28న వారణాసికి వెళ్లనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ట్రామా సెంటర్ను మోడీ ప్రారంభించనున్నారు.
అంతేకాదు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ ప్రధాని అయ్యాక తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి వెళ్లడం ఇది మూడోసారి.

ఎల్కే అద్వానీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశం రద్దు
బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దైంది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని అద్వానీ నివాసంలో కేజ్రీవాల్ భేటీ కావాల్సి ఉంది.
కాగా, అద్వానీయే కేజ్రీవాల్తో జరగాల్సిన భేటీని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారంరోజుల పాటు తీరిక లేకుండా ఉన్న షెడ్యూల్ కారణంగానే ముందుగా అనుకున్నట్లు కలవలేకపోతున్నట్లు అద్వానీ కార్యాలయం పేర్కొంది.
దేశంలో ఎమర్జెన్సీ రావొచ్చంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో అద్వానీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అద్వానీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చినీయాశమైయ్యాయి.
ఆయన వ్యాఖ్యలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు పలికారు. అద్వానీజీ సరైన విధంగా చెప్పారని ఢిల్లీయే తమకు మొదటి అనుభవమని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ గానీ, అటు ఆర్ఎస్ఎస్ గానీ అద్వానీ వ్యవస్థాపరంగా మాత్రమే అలా వ్యాఖ్యానించారని కేంద్ర ప్రభుత్వ తీరుపై కాదని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications