తమిళనాడు నుంచి పోటీచేయబోతున్న ప్రధాని మోడీ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయానికి వచ్చే సార్వత్రిక ఎన్నికలు గట్టి సవాల్ ను విసరబోతున్నాయి. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఎన్డీయే కూటమిని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమంటే కత్తిమీద సామే. ఎన్డీయేలో ఉన్న మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా కూటమికి గుడ్ బై చెప్పేస్తున్నాయి. తాజాగా బీహార్ లో జేడీయూ కూడా బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే.

వరుసగా మూడోసారి ఎవరూ గెలవలేదు..!
గతంలో ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. యూపీఏ కూడా వరుసగా రెండుసార్లు ప్రభుత్వాలను ఏర్పాటుచేసి మూడోసారి విఫలమైంది. అటువంటి సెంటిమెంట్ ను ఖాతరు చేయకుండా కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ-షా పనిచేస్తున్నారు. తమకు ఈసారి ఎన్ని నియోజకవర్గాలు తగ్గుతాయో అంచనా వేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 160 లోక్ సభ నియోజకవర్గాలు తగ్గుతాయని అంచనా వేశారు.

రామనాథపురం నుంచి లోక్ సభ బరిలోకి?
ఆ లోటును దక్షిణాది నుంచి పూడ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని రామనాథపురం లోక్ సభ నుంచి పోటీచేయడానికి ప్రధానమంత్రి మోడీ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోడీ వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. వడోదరకు రాజీనామా చేసి వారణాసిని అట్టిపెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి వారణాసి నుంచి పోటీచేసి గెలుపొందారు.

దక్షిణాదిపై పట్టు కోసం బీజేపీ
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతో కూడిన దక్షాణాది రాష్ట్రాల్లో పట్టుకోసం ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించుకుంటోంది. రామనాథపురం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రాముఖ్యతను కలిగివుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం రామనాథపురానికి ఆతిథ్యం ఇస్తుంది. భారత్, శ్రీలంక మధ్య అనుసంధానంగా ఉన్న రామసేతు రామనాథపురం నుంచే ప్రారంభమవుతుంది. దూకుడుగా వ్యవహరిస్తోన్న మాజీ పోలీసు అధికారి అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. మోడీ రామనాథపురం నుంచి పోటీచేయడంవల్ల తమిళనాడుతోపాటు దక్షిణ భారతదేశం మొత్తం ప్రభావం చూపుతుందని పార్టీ అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రామనాథపురంతోపాటు వారణాసి నుంచి కూడా పోటీచేయాలని మోడీ భావిస్తున్నారు. ఇక్కడ గెలుపొందితే వారణాసికి రాజీనామా చేస్తారు.












Click it and Unblock the Notifications