ప్రిన్స్ ఫిలిప్: డ్యూక్ ఆఫ్ ఎడిన్బరాకు అంతిమ వీడ్కోలు
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్బరా ప్రిన్స్ ఫిలిప్కు బ్రిటన్ అంతిమ వీడ్కోలు పలికింది.
దేశ ప్రజలంతా నివాళులు అర్పిస్తుండగా, తన కుటుంబ సభ్యులతో కలిసి క్వీన్ ఎలిజబెత్ 2 తన భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలను విండ్సర్ ప్యాలెస్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో నిర్వహించారు.
విండ్సర్ ప్యాలెస్ నుంచి సెయింట్ జార్జ్ చాపెల్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు.
క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ ఫిలిప్ నలుగురు సంతానం, ప్రిన్స్ విలియం, హ్యారీలు డ్యూక్ ఆఫ్ ఎడిన్బరా అంతిమయాత్రలో వెంట నడిచారు.
విండ్సర్ ప్యాలెస్కు కొద్దిదూరంలోనే ఉన్న సెయింట్ జార్జ్ చాపెల్కు వారంతా చేరుకున్నారు.
రాజ కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు అంతిమయాత్రలో ప్రిన్ ఫిలిప్ భౌతికకాయం వెంట నడిచారు.
ప్రిన్సెస్ అన్నే, ప్రిన్స్ చార్లెస్ ముందు వరుసలో నడవగా, ప్రిన్స్ ఎడ్వర్డ్, ప్రిన్స్ ఆండ్రూ తరువాతి వరుసలో ఉన్నారు.
మూడో వరుసలో డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ నడిచారు.
భారత కాలమానం ప్రకారం సాయత్రం 7.30గంటలకు ప్రిన్స్కు నివాళిగా దేశం యావత్తు ఒక నిమిషం పాటు మౌనం పాటించింది.
అంత్యక్రియల కార్యక్రమమంతా విండ్సర్ ప్యాలెస్ లోపలే జరిగింది.
కరోనావైరస్ నిబంధనల దృష్ట్యా ప్రజలు ఎక్కువమంది రావద్దని సూచించారు.
వైస్ అడ్మిరల్ సర్ తిమోతీ లారెన్స్, ఎర్ల్ ఆఫ్ స్నోడన్లు ఆ తర్వాత వరుసలో నడిచారు.
వారి వెనక డ్యూక్ కుటుంబ పరివారం ఉంది.
ప్రిన్స్ ఫిలిప్ భౌతికకాయం విండ్సర్ ప్యాలెస్ నుంచి సెయింట్ జార్జ్ చాపెల్కు చేరుకున్నాక, పడమర మెట్ల వద్దకు శవపేటికను మోసుకెళ్లారు.
అక్కడ శవపేటికను భుజాలపై పెట్టుకుని, ఒక నిమిషం మౌనం పాటించారు.
ఈలోగా క్వీన్ ఎలిజబెత్ 2 సెయింట్ జార్జ్ చాపెల్కు చేరుకున్నారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.
తర్వాత ఆమె కాంటర్బరీ ఆర్చిబిషప్ను కలిశారు.
కింగ్స్ ట్రూప్ గుర్రాల మీద కవాతు చేస్తూ విండ్సర్ ప్యాలెస్ వైపు వస్తుండగా, వందలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూశారు.
నలుపు, ఎరుపు, బంగారు వర్ణం యూనిఫామ్ ధరించిన సైనికులు తుపాకులు ధరించి, విండ్సర్ ప్యాలెస్లోని కేంబ్రిడ్జ్ గేట్ వరకు కవాతు నిర్వహించారు.
ప్రిన్స్ ఫిలిప్ భౌతికకాయం కోట నుంచి చాపెల్ వరకు తీసుకెళ్తున్న సమయంలో తూర్పు విండ్సర్ కోట నుంచి ఈ రెజిమెంట్ తుపాకులు పేల్చింది.
డ్యూక్కు నివాళి అర్పించేందుకు కొందరు విండ్సర్ కోటకు వచ్చారు. కానీ ఆంక్షల కారణంగా కోటంతా చాలా నిశ్శబ్దంగా ఉంది.
సెయింట్ జార్జ్ చాపెల్లోని పీఠంపై వేసే రెగాలియాను డ్యూక్ ఆఫ్ ఎడిన్బరానే స్వయంగా ఎంపిక చేసుకున్నారు.
బ్రిటన్, కామన్వెల్త్ దేశాలు ఆయనకు ఇచ్చిన చిహ్నాలు, మెడల్స్, ఇతర బిరుదులను తొమ్మిది కుషన్లపై పెట్టారు.
ప్రిన్స్ ఫిలిప్కు అంతిమ వీడ్కోలు పలికారు.