రోడ్డు ప్రమాదం కాదు, కుట్రే.. బాధితురాలి తల్లి ఆరోపణలు, సీబీఐ విచారణకు కాంగ్రెస్, ఎస్పీ డిమాండ్
ఉన్నావ్/న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి రోడ్డు ప్రమాదంపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆమెతో ఉన్న ఇద్దరూ చనిపోవడం, బాధితురాలు సహా మరొకరు గాయాలు కావడంతో ప్రమాదంపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై బాధితురాలి తల్లి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ హత్య చేయించాడని ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్, ఎస్పీ సీబీై చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
ప్రమాదమా ?
నిన్న రాత్రి రాయ్బరేలీ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న బంధువును కలిసేందుకు వెళ్తుండగా వారి కారును ట్రక్కు ఢీ కొంది. అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదని .. ప్రీ ప్లాన్డ్ యాక్సిడెంట్ అని యువతి తల్లి ఆరోపిస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ తమ కూతురి కారుపై దాడి చేయించారని పేర్కొన్నారు. గతేడాది యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కూతురిని మట్టుబెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.
ముమ్మాటికీ యాక్సిడెంటే ..
యువతి తల్లి ఇలా ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం యువతి కారుకు జరిగింది రోడ్డు ప్రమాదమేనని తేలుస్తున్నారు. ఇందులో కుట్రకోణం ఏమీ లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో యూపీ పోలీసు బాస్ ఓపీ సింగ్ స్పందించారు. ఉన్నావ్ రోడ్డు ప్రమాదంపై నిక్కచ్చిగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. విచారణపై అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు.
రాజ్యసభలో రగడ
మరోవైపు ఈ అంశం రాజ్యసభను కూడా కుదిపేసింది. ఈ అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కోరారు. డిప్యూటీ స్పీకర్ రమాదేవితో అనుచితంగా ప్రవర్తించారని ఆజాంఖాన్ను క్షమాపణలు కోరినా మీరు .. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పై ఏం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఉన్నావ్ రోడ్డు ప్రమాదంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ప్రమాదం కాదు
ఉన్నావ్ బాధితురాలి రోడ్డు ప్రమాదం కుట్ర అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. సెంగార్ మనుషులే రోడ్డు ప్రమాదం చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. బాధిత యువతి కారును ట్రక్కు ఎలా ఢీ కొంటుందని ప్రశ్నించారు. ఈ ఘటన సర్వత్రా అనుమానాలు కలిగిస్తుందన్నారు. సెంగార్ను కాపాడేందుకు యూపీ బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు లైంగికదాడి బాధితురాలికి కల్పించిన రక్షణ ఏమైందని ప్రశ్నించారు. ఓ గన్ మెన్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ప్రమాదం జరిగిన సమయంలో ఎందుకు లేరని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం తేలియనప్పుడు .. యూపీ ప్రభుత్వం బాధితురాలికి న్యాయం చేస్తుందని ఎలా అనుకోవాలి అని ప్రశ్నించారు.