పోలీసుల అదుపులో ప్రియాంకా గాంధీ: రోడ్డు మీద బైఠాయింపు: భగ్గుమన్న సోన్భద్ర
వారణాశి: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా అరెస్ట్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఆమెను ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రెండురోజుల కిందట చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో హతమైన 10 మంది మృతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు మీర్జాపూర్ వద్ద అడ్డగించారు. ముందుకు కదలనివ్వలేదు. దీనితో ప్రియాంకా గాంధీ నడిరోడ్డు మీదే బైఠాయించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు అండగా నిలిచారు.
ఉత్తర్ప్రదేశ్ సోన్భద్ర జిల్లాలోని ఘొరావాల్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా వారణాశిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ప్రియాంకా గాంధీ వాద్రా.. వారణాశికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆమె ఘోరావల్ గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో మీర్జాపూర్ వద్ద పోలీసులు ఆమెను అడ్డకున్నారు. ఘొరావల్ గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, 144 సెక్షన్ విధించామని తెలిపారు. ఈ నేపథ్యంలో- ఏ రాజకీయ నాయకుడి పర్యటనలను అనుమతించబోమని అన్నారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ ప్రియాంకా గాంధీ రోడ్డు మీదే బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ వైఖరిపై ధ్వజమెత్తారు. ఆమెను శాంతింపజేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. అవి విఫలం అయ్యాయి. దీనితో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- ఉత్తర్ ప్రదేశ్లో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు. బాధితులను పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు. పోలీసులు తనను ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారో తెలియదని, పేదల కోసం తాను ఎందాకైనా వెళ్తానని అన్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా అర్థం కావట్లేదని చెప్పారు.