హక్కుల కార్యకర్తలకు మావోలతో సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారం చూపండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అరెస్టు అయిన హక్కుల నేతలు మావోయిస్టులతో సంబంధాలు నెరుపుతున్నారన్నదానికి సంబంధించి ఒక్క డాక్యుమెంట్ అయిన చూపించాలని కోరింది సుప్రీంకోర్టు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ గతనెల 26న విరసం నేత వరవరరావు, లాయర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్త సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లఖ, న్యాయవాదులు అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొంసాల్వేజ్లను పూణే పోలీసులు అరెస్టు చేశారు.
2017 డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషద్ కార్యక్రమంలో దళిత సంఘాలు, సామాజిక కార్యకర్తలు భేటీ అయ్యారు. మరుసటి రోజునే భీమా కోరెగావ్ హింస చెలరేగింది. దీనికి బాధ్యులు ఈ సామాజిక కార్యకర్తలే అని తమ విచారణలో వెల్లడైందని చెబుతూ పూణే పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
భారీ భద్రత నడుమ హైదరాబాద్కు వరవరరావు
ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది.
భిన్నాభిప్రాయాలను వెల్లడించే గొంతుకలను నొక్కేయడానికే ఐదుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు అరెస్టు చేశారని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, మరో నలుగురు మేధావులు ఆరోపించారు. పుణె పోలీసుల చర్య.. పౌరుల స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చేసిన దాడి అని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో అభివర్ణించారు. కోరెగావ్-భీమా హింసలో ఎఫ్ఐర్లు నమోదయిన హిందూ అతివాద కార్యకర్తలపై మాత్రం ఎటువంటి చర్యా తీసుకోలేదని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేసినట్లు పౌరహక్కులనేత గౌతం నవలఖ ఆరోపించారు.