జయలలిత మృతి: శశికళ గురించి వెలుగు చూసిన షాకింగ్, ఏం చేయాలి?
జయలలిత నెచ్చెలి శశికళ గురించిన షాకింగ్ అంశం ఒకటి వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. జయకు శశికళ కీడు చేసిందని అంటున్నారు.
చెన్నై: జయలలిత నెచ్చెలి శశికళ గురించిన షాకింగ్ అంశం ఒకటి వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. జయకు శశికళ కీడు చేసిందని అంటున్నారు. ఇప్పటికే జయలలిత మృతి పైన కోడలు దీపా జయకుమార్, పార్టీ నుంచి బహిష్కరించబడిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, ట్రాఫిక్ రామస్వామి తదితరులు శశికళ వైపు వేళ్లు చూపిస్తున్నారు.
శశికళకు చెక్, అన్ని వైపులా ఇలా కట్టడి!: పన్నీరుసెల్వంతో బీజేపీ పావులు?
తాజాగా, మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా పిలువబడే గురుమూర్తి ప్రముఖ మేగజైన్ తుగ్లక్లో కథనం రాశారు. గురుమూర్తికి ఆరెస్సెస్తో నేరుగా సంబంధాలు లేవు. ఇతనికి బీజేపీ కీలక నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
తుగ్లగ్ మేగజైన్ను ఇటీవలే మరణించిన చో రామస్వామి తీసుకు వచ్చారు. చో దివంగత జయలలితకు కూడా దగ్గరి వారు. జయలలిత మృతి చెందిన తర్వాత అదే ఆసుపత్రిలో చో కూడా కన్నుమూశారు.
అన్నాడీఎంకే భవిష్యత్తు
ఈ తుగ్లక్ పత్రిక 'అన్నాడీఎంకే భవిష్యత్తు' పేరుతో ఓ కథనం రాసింది. ఇందులో గతంలో జరిగినట్లుగా చెబుతూ కొన్ని అంశాలను పేర్కొంది. ఇందులో శశికళకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఉన్నాయని పేర్కొంది.
అమ్మకు చిన్నమ్మ లేఖ
సమాచారం మేరకు.. జయలలిత గతంలో కొద్ది నెలల పాటు శశికళను దూరం పెట్టారు. ఆ తర్వాత శశికళ 'అమ్మ'కు లేఖ రాశారు. తనను పోయెస్ గార్డెన్లోకి రానివ్వాలని, తనకు పార్టీలో లేదా పబ్లిక్ లైఫ్లో (ప్రభుత్వంలో) ఎలాంటి పదవి అవసరం లేదని, కేవలం జయలలితకు సేవ చేసేందుకు మాత్రమే వస్తానని చెబుతూ క్షమాపణ కూడా చెప్పినట్లు శశికళ లేఖ రాశారని పేర్కొంది.
మృతి చెందాక రివర్స్
కానీ, జయలలిత మృతి చెందిన మరుసటి రోజే, ఆమె మృతదేహం రాజాజీ హాలులో ఉండగానే పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు దానిని మరిచిపోయారని పేర్కొంటున్నారు.
అంతేకాదు, జయలలిత చనిపోయిన ఐదు రోజుల తర్వాత శశికళకు పార్టీ చీఫ్ పదవిని కట్టబెట్టాలని పార్టీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారని ఆ పత్రికలో పేర్కొన్నారు.
పదవులు వద్దని చెప్పి..
తనకు ఎలాంటి పదవులు వద్దని చెబుతూ తిరిగి పోయెస్ గార్డెన్ వచ్చిన శశికళ.. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో పదవుల కోసం చూస్తున్నారని, మీడియా ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నారని, సెలబ్రిటీలతో పోయెస్ గార్డెన్లో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
శశికళ అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే..
గతంలో జయలలితకు క్షమాపణ లేఖ రాసి, తిరిగి పోయెస్ గార్డెన్ వచ్చిన శశికళ, అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే.. తనను తదుపరి పార్టీ అధినేత్రిగా చూపించవద్దని అన్నాడీఎంకే క్యాడర్కు సూచించాలని కూడా సదరు పత్రిక హితవు పలికింది. తనను ముఖ్యమంత్రిగా చెప్పవద్దని ఆమె సూచించాలని పేర్కొంది.
ఐదుగురు సభ్యుల కమిటీ.. ఇప్పుడు ఓ అవకాశం
కాగా, ఐదుగురు సభ్యులతో కూడిన పార్టీ కమిటీ కార్యకర్తల నుంచి.. తదుపరి చీఫ్ పైన రెఫరెండం తీసుకుంటుంది. అయితే, ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు ఆ పార్టీకి దొరకడం ఇప్పుడు కష్టమే అంటున్నారు. అదే సమయంలో ఆ పార్టీకి ఇప్పుడు ఓ అవకాశం వచ్చిందంటున్నారు. ఇన్నాళ్లు ఒక్కరి పైనే పార్టీ ఆధారపడిందని, ఒక్కరి పైన ఆధారపడటం ఆ పార్టీ మానుకోవడానికి ఇదే అవకాశమని అంటున్నారు.