గోవాలో ప్రభుత్వం మాదే - ప్రమోద్ ధీమా : హంగ్ - క్యాంపు రాజకీయాలతో అలర్డ్..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు గోవా ప్రత్యేకంగా నిలిచింది. అక్కడ ఎవరికీ పూర్తి మెజార్టీ దక్కే ఛాన్స్ కనిపించటం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తోంది. దీంతో..ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అయితే, మూడు రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం ఎలాగైనా బీజేపీలో తామే అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అందులో భాగంగా కావాల్సిన 21 సీట్ల మేజిక్ ఫిగర్ కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 19 సీట్లలో ఆధిక్యతలో ఉంది.
Recommended Video
కాగా, కాంగ్రెస్ 12 సీట్లతో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ - బీజేపీ నేతలు ఫలితాలకు ముందే గోవా చేరుకున్నారు. కాంగ్రెస్ గత అనుభవనాలతో తమ పార్టీ ఎమ్మెల్యేలు చే జారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ మాత్రం తామే మరోసారి ప్రభుత్వాన్ని చేపడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ తో పాటుగా స్వతంత్ర్య అభ్యర్థులందరూ తమకే మద్దతునిస్తున్నారని తెలిపారు. 2017 లో కాంగ్రెస్ 17 స్థానాలు దక్కించుకోగా..ఈ సారి 12 సీట్లకే పరిమితం అయింది. ఆప్ రెండు స్థానాలు దక్కించుకుంది. గోవాలో హంగ్ కు ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేసారు. అయితే, తుది ఫలితాల సమయానికి తమకే అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని కమల నాధులు అంచనా వేస్తున్నారు.
40 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయగా..కాంగ్రెస్ పార్టీ 37 సీట్లలో, మిత్రపక్షం జీఎఫ్పీ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఆప్ 39 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక స్థానంలో ఇండిపెండెంట్కు మద్దతిచ్చింది. టీఎంసీ 26 స్థానాల్లో, ఎంజీపీ 13, ఎన్సీపీ 13, శివసేన 10 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రమోద్ సావంత్ మొత్తం వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అమిత్ పాలేకర్ రంగంలో దిగగా..కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు. అయితే, తుది ఫలితాల తరువాతనే గోవా లో ప్రభుత్వ ఏర్పాటు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.