‘భారత్ బంద్ కాదు, నిరసన మాత్రమే’: బ్యాంకులకు మినహాయింపు
తాము భారత్ బంద్కు మద్దతివ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: తాము భారత్ బంద్కు మద్దతివ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామే తప్ప భారత్ బంద్కు పిలుపునివ్వలేదని జైరాం రమేష్ తేల్చి చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ కేంద్రం రాజకీయ ఎత్తుగడను ప్రదర్శిస్తుందని ఆరోపించారు.
నల్లధనం ఉన్నవారు ఎటువంటి ఇబ్బందులు పడటం లేదు, కానీ నల్లధనం లేని సాధారణ ప్రజలు ఈ నిర్ణయం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జైరాం రమేష్ అన్నారు. దురదృష్టవశాత్తూ నోట్ల రద్దు ప్రభావం ప్రజలపై పడింది, నల్లధనం ఉన్న వారు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.
కాంగ్రెస్, వేరే పార్టీలు భారత్ బంద్ను చేపడుతున్నట్లు బిజెపి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని మాజీ కేంద్ర మంత్రి రమేశ్ మండిపడ్డారు. సోమవారం దేశవ్యాప్తంగా నోట్ల రద్దును నిరసిస్తూ జన్ ఆక్రోశ్ దివస్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ బంద్ నుంచి బ్యాంకులకు మినహాయింపునిచ్చారు.
తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు బంద్లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ మాత్రం నిరసన ప్రదర్శనలకే పరిమితం కానుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. బంద్ ప్రభావం కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.