రైల్వే ఉద్యోగుల ధర్నా: రైళ్లకు బ్రేక్లు, చుక్కలు చూపించారు
బెంగళూరు: బెంగళూరు సిటి రైల్వే స్టేషన్ లో ఉద్యోగులు ఒక్క సారిగా ధర్నా నిర్వహించడంతో ప్రయాణికులకు చుక్కలు కనపడ్డాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివిధయూనియన్ సంఘాల నాయకులతో చర్చించారు, ఉద్యోగులు ధర్నా విరమించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో బెంగళూరు సిటి రైల్వే స్టేషన్ లో టిక్కెట్ కౌంటర్లు మూతపడ్డాయి. అన్ని ఫ్లాట్ ఫాంల మీద సిగ్నల్స్ ఆఫ్ చేశారు. సాయంత్రం ఆరు గంటల నుండి సిటి రైల్వే స్టేషన్ నుండి వివిద ప్రాంతాలకు వెళ్లే రైళ్లు నిలిచి పోయాయి. 188 రైల్వే స్టేషన్ లలో ఈ ప్రభావం కనపడింది.
అదే విధంగా వివిద ప్రాంతాల నుండి వచ్చే రైళ్లు సిటి రైల్వే స్టేషన్ చేరుకోలేదు. ఫ్లాట్ ఫాం నెంబర్ 8 లో గుమికూడిన రైల్వే ఉద్యోగులు పై అధికారుల పని తీరుపై మండిపడుతూ నినాదాలు చేశారు. సౌత్ వెస్టన్ రైల్వే అధికారి ఎ.ఆర్. పాండురంగను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. రాత్రి 8 గంటల సమయంలో అధికారులు ఫ్లాట్ ఫాం నెంబర్ 8 దగ్గరకు వెళ్లారు. యూనియన్ నాయకులతో చర్చించి పాండురంగను విడుదల చేయించడానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. రాత్రి 8.15కు రైళ్లు కదిలాయి.
ఇది జరిగింది, రంగంలోకి రైల్వే పోలీసులు!
రైల్వే పార్శిల్, వాణిజ్య విభాగంలో పాండురంగ అధికారిగా పని చేస్తున్నారు. సిటి రైల్వే స్టేషన్ లోని పార్కింగ్ స్థలంలో చాలా కాలం నుండి నిలిపిన వాహనాలు, పార్శిల్ వచ్చినా యజమానులు రాని వాహనాలు గుర్తించారు. తరువాత న్యాయస్థానం అనుమతితో 2014 ఆ వాహనాలు బహిరంగ వేలం వేశారు.
వేలం పూర్తి అయిన తరువాత ఒక బైక్ యజామాని వెళ్లి విషయం తెలుసుకున్నాడు. తన బైక్ విక్రయించి మోసం చేశారని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పాండురంగ వేలం వేసిన సోమ్ము మొత్తం రైల్వే శాఖలో జమ చెయ్యలేదని, కొంత స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
రైల్వే పోలీసులు కొందరు అధికారులకు నోటీసులు జారీ చేశారు. కోందరు బెయిల్ తీసుకున్నారు. ఈనెల 5వ తేదిన పాండురంగను రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పాండురంగను చట్టపరంగా విడుదల చేయించడానికి రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.