కేజ్రీ ఎన్నికపై హైకోర్టుకు: ఎఎపి విధ్వంసం, వానలోనూ
న్యూఢిల్లీ: ఆమ్ అద్మీ పార్టీ (ఎఎపి) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి సోమనాథ్ భారతి ఎన్నికను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో వారు ఎన్నికల వ్యయ పరిమితికి మించి ఖర్చు చేశారని తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆప్ ధర్నా ఉద్రిక్తం
కేజ్రీవాల్, ఎఎపి ధర్నా ప్రాంతం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలోని రైల్ భవన్ వద్ద ధర్నా చేస్తున్న వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రైసినా రోడ్డులోని బారీకేడ్లను ఎఎపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్లో నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎఎపి కార్యకర్తల రాళ్ల దాడిలో ఓ పోలీసుకు కూడా గాయాలయ్యాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రైల్ భవన్ వద్ద ఎఎపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎఎపి ఆందోళనకు సమాజ్ వాది పార్టీ మద్దతు ప్రకటించింది.
కేజ్రీవాల్ పైన నివేదిక
కేజ్రీవాల్ పైన ఎంహెచ్వోకు ఢిల్లీ పోలీసులు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 24వ తేదీలోగా ధర్నా ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా కేజ్రీవాల్ను ఆదేశించే అవకాశముంది. కాగా, డిమాండ్లు పరిశీలించే వరకు తమ ధర్నా కొనసాగుతుందని కేజ్రీవాల్ చెప్పారు.
ఎఎపి నేతలు ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా ధర్నా చేస్తున్నారు. హఠాత్తుగా వర్షం కురవడంతో వారు వానలోనే నృత్యం చేస్తూ పాటలు పాడుతూ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్ కాసేపు కారులో విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం రాత్రి పేవ్ మెంట్ పైన పడుకున్న ఆయనకు సిఆర్పిఎప్ రక్షణగా బందోబస్తు నిర్వహించాయి.
మరోవైపు ఉగండ మహిళల పట్ల మిస్ బిహేవ్ చేసినందుకు ఢిల్లీ మహిళా కమిషన్ సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేసింది.