పౌల్ట్రీపై కరోనా చావు దెబ్బ.. ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.. అది నిరూపిస్తే రూ.1కోటి నజరానా..
కరోనా కారణంగా చాలా రంగాలు కుదేలవుతున్నాయి. భారత్లో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్,మాల్స్ మూసివేయడంతో.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ రంగానికి నష్టం వాటిల్లనుంది. ఈ ఒక్క రంగమే కాదు.. రవాణా,ఫుడ్ బిజినెస్,ఆయా రంగాల ఉత్పత్తులపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా పౌల్ట్రీ రైతులను కరోనా చావు దెబ్బ కొట్టింది. దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో నష్టాలను చవిచూడని పౌల్ట్రీ రైతులు.. కరోనా దెబ్బకు విలవిలాడుతున్నారు. కరోనా వైరస్కు చికెన్కు సంబంధం లేదని చెబుతున్నా జనం చికెన్ తినేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు పౌల్ట్రీ ఫెడరేషన్ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది.
అది నిరూపిస్తే.. కోటి నజరానా
కోడి గుడ్లు, చికెన్ తినడం వలన కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఎవరైనా నిరూపిస్తే.. వారికి రూ.కోటి నజరానా అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్ సొసైటీ సంయుక్త ప్రకటన చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తితో పౌల్ట్రీ రంగం దెబ్బతినడంతో.. మంగళవారం నామక్కల్లో పౌల్ట్రీ రైతులు సమావేశమై దీనిపై చర్చించారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని పౌల్ట్రీ ఫెడరేషన్ రైతుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. ఈ నేపథ్యంలో చికెన్పై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించాలంటే.. రూ.కోటి ఛాలెంజ్తో ప్రచారం నిర్వహించాలని పౌల్ట్రీ ఫెడరేషన్ నిర్ణయించింది.
రెండు వారాల్లో రూ.500కోట్లు నష్టం
కరోనా వైరస్ కారణంగా కేజీ చికెన్ ధర రూ.80 నుంచి రూ.10కి పడిపోయిందని సమావేశంలో పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చికెన్,కోడిగుడ్ల వినియోగం తగ్గించడంతో దాదాపు 15లక్షల గుడ్లు పౌల్ట్రీ ఫామ్స్లోనే నిలిచిపోయాయని చెప్పారు. అలాగే స్కూళ్లకు సెలవుల కారణంగా మరో 4కోట్ల గుడ్లు నిలిచిపోయినట్టు తెలిపారు.ఒక్క నామక్కల్ పరిధిలోనే పౌల్ట్రీ రైతులు రోజుకు రూ.8కోట్లు నష్టం చవిచూస్తున్నారని తెలిపారు. గడిచిన రెండు వారాల్లో తమిళనాడులో పౌల్ట్రీ పరిశ్రమ రూ.500కోట్లు నష్టపోయిందన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులు ప్రజల్లోకి వెళ్లడం వల్లే పౌల్ట్రీ తీవ్రంగా నష్టపోతోందన్నారు.
సీఎంను కలవనున్న పౌల్ట్రీ రైతులు
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా చైనా,ఇటలీ,అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికీ ప్రజలు చికెన్,కోడి గుడ్లు ఆహారంగా తీసుకుంటున్నారని తమిళనాడు పౌల్ట్రీ రైతులు అంటున్నారు. కేవలం మన దేశంలోనే కరోనా వైరస్ కారణంగా ప్రజలు చికెన్ తినడం మానేశారన్నారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలిసి పౌల్ట్రీని ఆదుకోవాల్సిందిగా కోరుతామన్నారు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేలా చికెన్ తినడం గురించి ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయమని కోరుతామన్నారు.
Recommended Video
తెలంగాణలోనూ అదే పరిస్థితి..
చికెన్ తింటే కరోనా వస్తుందన్న అపోహలతో జనం చికెన్ తినడం మానేయడంతో.. చాలాచోట్ల పౌల్ట్రీ రైతులు కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల కోళ్లను సజీవంగా సమాధి చేసేస్తున్నారు. హైదరాబాద్ విషయానికొస్తే.. నగరంలోనూ చికెన్పై కరోనా గట్టి ప్రభావమే చూపిస్తోంది. చాలావరకు షాప్స్ తక్కువ ధరకే చికెన్ను విక్రయిస్తున్నాయి. కొన్ని చోట్ల కేజీ చికెన్ రూ.60 ఉంటే,మరికొన్ని చోట్ల రూ.40 మాత్రమే ఉంది. దీంతో అటు పౌల్ట్రీతో పాటు దానిపై ఆధారపడ్డ రిటైల్ ఔట్లెట్స్ కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. స్వయంగా తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ సైతం కరోనా కారణంగా పౌల్ట్రీ వ్యాపారంలో నష్టాలను చవిచూశారు. దాదాపు రూ.8కోట్లు వరకు తన వ్యాపారానికి నష్టం వాటిల్లిందని ఆయనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.